
ముంబై: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్కు భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా మద్దతుగా నిలిచాడు. ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్ తరహాలోనే పంత్ ఆడుతున్నాడన్నాడు. ఓ వికెట్ కీపర్గా పంత్ ఇప్పటికే అతడెన్నో ఘనతలు సాధించినట్లు నెహ్రా గుర్తుచేశాడు. పంత్ కుదురుకొవడానికి కాస్త సమయం ఇవ్వాలని సూచించాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు టెస్టు సిరీస్లో పంత్ కీపింగ్లో రాణిస్తున్నప్పటికీ.. బ్యాటింగ్లో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ఒక్క ప్రదర్శన చేయలేదు. దీంతో అతడిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
రిషబ్ పంత్ ఈ ఏడాది టెస్టుల్లో విజయవంతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది నిరాశపరిచినా.. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా పర్యటన ద్వారా గాడిలో పడ్డాడు. రెండు సూపర్ ఇన్నింగ్స్లు ఆడి టీమిండియాకు ఊహించని విజయాలను అందించాడు. ఆపై ఇంగ్లండ్ జట్టుతో స్వదేశంలో జరిగిన టెస్ట్ మ్యాచులో కూడా రాణించాడు. ఐపీఎల్ 2021లో కూడా ఆకట్టుకున్నాడు. అయితే ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనలో మూడు టెస్టులు ఆడినా ఒక్కటీ పెద్ద స్కోర్ సాధించలేకపోయాడు. అయినా ఈ ఏడాది అతడి టెస్టు బ్యాటింగ్ సగటు 43గా ఉండడం గమనార్హం.
ఓ జాతీయ స్పోర్ట్స్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆశిష్ నెహ్రా మాట్లాడుతూ... 'రిషబ్ పంతే కాదు ఏ అంతర్జాతీయ క్రికెటరైనా సమయాన్ని బట్టి ఆటను మార్చుకోవాలి. అయితే వారి ఆటతీరును, సొంతశైలి, బలాన్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు. బంతిని డిఫెండ్ చేస్తూనో, షాట్ ఆడుతూనో వికెట్ ఇచ్చేస్తే.. అదే పంత్ గబ్బాలో టెస్టు గెలిపించాడని గుర్తుంచుకోవాలి. టెస్టు క్రికెట్లో పంత్ ఆటతీరు, శైలి ఎప్పుడూ చర్చనీయం అవుతున్నాయి. ఆడమ్ గిల్క్రిస్ట్ కూడా ఇదే తరహాలో ఆడతాడు. అతడికి తన బలమేంటో తెలుసు. కెరీర్ ఆసాంతం అలాగే ఆడాడు. పంత్కు కాస్త సమయం ఇవ్వాలి' అని అన్నాడు.

'రిషబ్ పంత్కు కాస్త సమయం ఇవ్వాలి. అతడు నిర్భయంగా ఆడేందుకు జట్టు యాజమాన్యం అండగా నిలిచింది. కఠిన పరిస్థితుల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పిచ్లపై సెంచరీలు చేసిన ఆటగాడి గురించి మాట్లాడుతున్నామని గుర్తుంచుకోవాలి. ఒక వికెట్ కీపర్గా మాట్లాడితే ఇప్పటికే అతడెన్నో ఘనతలు సాధించాడు. అతడు కుదురుకోవడానికి కాస్త సమయం పడుతుంది. అందరూ కొంచెం ఓపికగా ఉండాలి' అని భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా చెప్పాడు. పంత్ ఇప్పటివరకు భారత్ తరఫున 24 టెస్టులు, 18 వన్డేలు, 33 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 1490, వన్డేల్లో 529, టీ20ల్లో 512 రన్స్ చేశాడు.
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ముగిసిన మూడో టెస్టులో కోహ్లీసేన ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మొదటి ఇన్నింగ్స్లో 78 పరుగులకే కుప్పకూలిన భారత్.. రెండో ఇన్నింగ్స్లో 278 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 432 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో ఈ మ్యాచ్లో విజయం సాధించిన రూట్ సేన.. సిరీస్ను 1-1తో సమం చేసింది. మరో రెండు టెస్ట్ మ్యాచ్లు జరగాల్సి ఉంది. లండన్ వేదికగా సెప్టెంబర్ 2 నుంచి నాలుగో టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ టెస్టులో విజయం సాధించి సిరీస్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.