
లీడ్స్: మైదానంలో వికెట్ల వెనక నుంచి ఫన్నీ కామెంట్లు చేసి సహచరులను ఉత్సాహపరిచే టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్ రిషబ్ పంత్ తాజాగా మరోమారు వార్తల్లోకి ఎక్కాడు. ఐదు టెస్ట్ మ్యాచుల సిరీసులో భాగంగా లీడ్స్లో శనివారం ముగిసిన మూడో టెస్టులో బ్యాటింగ్కు దిగిన పంత్ వచ్చినంత వేగంగా పెవిలియన్ చేరాడు. ఓలి రాబిన్సన్ బౌలింగ్లో క్రెయిగ్ ఓవర్టన్కు సునాయాస క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన పంత్.. 7 బంతులాడి ఒక పరుగుకే పెవిలియన్ చేరాడు. అయితే పంత్ విషయంలో నాలుగో రోజు ఆటలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.
అజింక్య రహానే బ్యాటింగ్ చేస్తుండగా.. నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న రిషబ్ పంత్ తనకేదీ పట్టదన్నట్లుగా బ్యాటింగ్ ప్రాక్టీస్ (షాడో బ్యాటింగ్) చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. జేమ్స్ అండర్సన్ బంతిని సంధించాక.. పంత్ అప్పటికప్పుడు అప్రమత్తమయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. పంత్ షాడో బ్యాటింగ్ చేస్తున్న విషయం తెలిసి రహానే క్రీజు నుంచి ఎందుకు పక్కకు తప్పుకోలేదని కొందరు ప్రశ్నిస్తుంటే, నాన్ స్ట్రైకింగ్ ఎండ్ నుంచే అండర్సన్ను ఎదుర్కొనేందుకు పంత్ సిద్ధమయ్యాడంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.
ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్లో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ దారుణంగా విఫలమవుతున్నాడు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో రెండు పరుగులు మాత్రమే చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్లో ఒకే ఒక్క పరుగు చేశాడు. రెండుసార్లూ ఓలి రాబిన్సన్కే దొరికిపోయాడు. ఆస్ట్రేలియా పర్యటనతో పాటు ఇంగ్లండ్తో స్వదేశంలో జరిగిన సిరీస్లో చెలరేగిన పంత్కు ఈ సిరీస్ మాత్రం చాలా కఠినంగానే ఉంది. పంత్ ఐదు ఇన్నింగ్స్లలో 87 పరుగులు మాత్రమే చేశాడు. మొదటి టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. వరణుడి కారణంగా చివరి రోజు తుడిచిపెట్టుకుపోయింది. పంత్ ఇలానే విఫలమయితే.. సీనియర్ కీపర్ వృద్ధిమాన్ సాహా జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య శనివారం ముగిసిన మూడో టెస్టులో కోహ్లీసేన ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మొదటి ఇన్నింగ్స్లో 78 పరుగులకే కుప్పకూలిన భారత్.. రెండో ఇన్నింగ్స్లో 278 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 432 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో ఈ మ్యాచ్లో విజయం సాధించిన రూట్ సేన..సిరీస్ను 1-1తో సమం చేసింది. మరో రెండు టెస్ట్ మ్యాచ్లు జరుగాల్సి ఉంది. లండన్ వేదికగా సెప్టెంబర్ 2 నుంచి నాలుగో టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఇక మాంచెస్టర్ వేదికగా సెప్టెంబర్ 10 నుంచి చివరి టెస్ట్ జరగనుంది.
టెస్టు సిరీస్లో భాగంగా ప్రస్తుతం ఇంగ్లండ్లో పర్యటిస్తున్న రిషబ్ పంత్.. ఇటీవల ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ ఫొటోను పంచుకున్నాడు. ఆ ఫొటోలో రంగురంగుల హుడీ, షార్ట్తో పాటు రెండు కలర్ల (ఎరుపు, నీలం) సాక్సులు ధరించి కాస్త విచిత్రంగా ఉన్నాడు. 'క్లాస్లో అందరికంటే బుద్ధిమంతుడు' అంటూ హిందీలో ఓ కాప్షన్ రాసుకొచ్చాడు. నవ్వుతున్న ఎమోజీలను కూడా ఆ ఫొటోకు జత చేశాడు. దీంతో అది కాస్త నెట్టింట వైరల్ అయింది. పంత్ కామెడీ పోస్టుపై.. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ అంతే కామెడీగా స్పందించాడు. ఆ ఫొటోను తానే తీశానని తెలియజేసేలా.. 'బుద్ధిమంతుడివి నువ్వు కాదు.. ఆ ఫొటో తీసిన వ్యక్తి' అంటూ కామెంట్ చేశాడు.