ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో టీమిండియా ఆఖరి మ్యాచ్కు సిద్ధమవుతోంది. ఇప్పటికే 3-1తో సిరీస్ కైవసం చేసుకున్న భారత్ చివరి టెస్టులోనూ విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. ప్రపంచ టెస్టు ఛాంపియనషిప్ ఫైనల్ బెర్తు సంపాదించాలంటే ప్రతి టెస్టు ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి ఇంగ్లండ్కు ఆఖరి పంచ్ స్ట్రాంగ్గా ఇవ్వాలని రోహిత్సేన భావిస్తోంది.
గురువారం నుంచి ధర్మశాల వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య చివరి టెస్టు జరగనుంది. పిచ్, వాతావరణ పరిస్థితులు భారత్కు కంటే ఇంగ్లండ్కు అనుకూలంగా ఉండనున్నాయి. అయితే బీసీసీఐ ఆదేశాలతో ధర్మశాలకు టీమిండియా నయా ఫినిషర్ రింకూ సింగ్ చేరుకున్నాడు. టెస్టు జట్టులో రింకూ భాగం కానప్పటికీ భారత జట్టుతో కలిసి సందడి చేశాడు. ఫొటోలకు ఫోజులు ఇచ్చాడు. భారత జట్టు సోమవారం ప్రాక్టీస్కు కాస్త దూరంగా ఉంది. ఫొటోలతోనే బిజీగా ఉంది.

జూన్లో జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం ఈ ఫొటో సెషన్ జరిగినట్లు తెలుస్తోంది. వరల్డ్ కప్కు ఎంపికయ్యే ప్రాబబుల్స్తో ఫొటో సెషన్ను బీసీసీఐ నిర్వహించింది. ఐపీఎల్తో పాటు ఇటీవల జరిగిన దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్లో రింకూ సత్తాచాటిన విషయం తెలిసిందే. ప్రశాంతతో ఉంటూ మ్యాచ్లను ముగించే సత్తా ఉన్న రింకూ టాలెంట్కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ ఫిదా అయ్యారు. మెగాటోర్నీలో రింకూ స్థానం ఖరారైందని గతంలోనే పరోక్షంగా వెల్లడించారు.
ప్రపంచకప్ జట్టులో దాదాపు 9 నుంచి 10 మంది ఆటగాళ్లు ఎంపిక ఫిక్స్ అయిపోయిందని అఫ్గానిస్థాన్ సిరీస్ ముగిసిన అనంతరం రోహిత్ పేర్కొన్న విషయం తెలిసిందే. తాజా ఫొటో సెషన్తో టీ20 వరల్డ్ కప్ జట్టు ఎంపికకు ఐపీఎల్ ప్రదర్శనను పరిగణన నామమాత్రమే అని స్పష్టమవుతోంది. రింకూ ఎంపిక ఖరారైందని తెలుస్తోంది.
ఇంగ్లండ్ టెస్టు సిరీస్ ముగిసిన అనంతరం మార్చి 22 నుంచి జరగనున్న ఐపీఎల్లో భారత ఆటగాళ్లు పాల్గొననున్నారు. ఐపీఎల్ ముగిసిన తర్వాత వరల్డ్ కప్ కోసం అమెరికా, వెస్టిండీస్కు టీమిండియా పయనమవుతోంది. జూన్లో జరగనున్న ఈ పొట్టి కప్కు అమెరికా-వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే.