రాంచీ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత బౌలర్లు సత్తాచాటుతున్నారు. స్పిన్కు అనుకూలిస్తుండటంతో మన స్పిన్నర్లు రెచ్చిపోతున్నారు. గిరగిర తిరిగే బంతులతో ఇంగ్లండ్ బ్యాటర్లును ఇబ్బంది పెడుతున్నారు. మన స్పిన్నర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 133 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది.
వికెట్ల వేటను అశ్విన్ మొదలుపెట్టాడు. వరుస బంతుల్లో బెన్ డకెట్ (15; 15 బంతుల్లో), ఒలీ పోప్ (0; 1 బాల్)ను ఔట్ చేశాడు. కాసేపటికే ప్రమాదకర బ్యాటర్ జో రూట్ (11; 34 బంతుల్లో)ను అశ్విన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ క్రమంలో రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర సృష్టించాడు.

స్వదేశంలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అశ్విన్ చరిత్రకెక్కాడు. 352 వికెట్లు పడగొట్టి ఈ ఘనత అందుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే పేరిట ఉంది. ఇండియాలో కుంబ్లే 350 వికెట్లు సాధించాడు. ఈ జాబితాలో అశ్విన్, కుంబ్లే తర్వాత హర్భజన్ సింగ్ (265), కపిల్ దేవ్ (219), రవీంద్ర జడేజా (206) ఉన్నారు.
అయితే అశ్విన్ మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఓ ప్రత్యర్థి జట్టుపై 100 వికెట్లు తీయడమే కష్టమంటే.. అశ్విన్ రెండు దేశాలపై ఈ ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాపై 114 వికెట్లు, ఇంగ్లండ్పై 102 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో రెండు దేశాలపై 100కు పైగా వికెట్లు సాధించిన ఏకైక బౌలర్గా అశ్విన్ రికార్డు సృష్టించాడు.
కాగా, ప్రస్తుతం 45 ఓవర్లకు ఇంగ్లండ్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. బెన్ ఫోక్స్(9), షోయబ్ బషీర్ (1) క్రీజులో ఉన్నారు. జాక్ క్రాలే (60; 91 బంతుల్లో) అర్ధశతకం సాధించాడు. భారత బౌలర్లలో కుల్దీప్ నాలుగు , అశ్విన్ మూడు వికెట్లు, జడేజా ఒక వికెట్ తీశారు.
తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 353 పరుగులు చేసిన విషయం తెలిసిందే. జో రూట్ (122*) సెంచరీ సాధించాడు. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన భారత్ మొదటి ఇన్నింగ్స్లో 307 పరుగులు చేసింది. ధ్రువ్ జురెల్ (90) టాప్ స్కోరర్.