రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. క్రాలేను ఔట్ చేసి టెస్టు క్రికెట్లో 500వ వికెట్ అందుకున్నాడు. ఈ క్రమంలో చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో 500 వికెట్లు వేగంగా తీసిన భారత బౌలర్గా చరిత్రకెక్కాడు. 98 టెస్టుల్లో అశ్విన్ ఈ ఘనత అందుకున్నాడు. అంతకుముందు అనిల్ కుంబ్లే పేరిట ఈ రికార్డు ఉంది. కుంబ్లే 105 టెస్టుల్లో 500 వికెట్ల మార్క్ను తాకాడు.
ఓవరాల్గా వేగంగా 500 వికెట్లు తీసిన రెండో బౌలర్గా అశ్విన్ రికార్డు నెలకొల్పాడు. టాప్లో శ్రీలంక స్పిన్ దిగ్గజం మురళీథరన్ ఉన్నాడు. అతడు 87 టెస్టుల్లో ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో మురళీథరన్ (87), అశ్విన్ (98), అనిల్ కుంబ్లే (105), షేన్ వార్న్ (108), మెక్గ్రాత్ (110) వరుసగా ఉన్నారు. బంతుల పరంగా వేగంగా 500 వికెట్లు సాధించిన రికార్డులో భారత్ తరఫున అగ్రస్థానంలో, ప్రపంచ వ్యాప్తంగా రెండో స్థానంలో అశ్విన్ నిలిచాడు.

ఆస్ట్రేలియా పేసర్ మెక్గ్రాత్ టాప్లో ఉన్నాడు. అతడు 25528 బంతుల్లో 500 వికెట్లు తీశాడు. ఆ తర్వాత స్థానాల్లో రవిచంద్రన్ అశ్విన్ (25714) , జేమ్స్ అండర్సన్ (28150), స్టువర్ట్ బ్రాడ్ (28430), కోర్ట్నీ వాల్ష్ (28833) ఉన్నారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే ఇంగ్లండ్ 17 ఓవర్లకు వికెట్ కోల్పోయి 100 పరుగులు చేసింది. భారత్ కంటే 345 పరుగుల వెనుకంజలో ఉంది. డకెట్ (69*; 61 బంతుల్లో) దూకుడుగా ఆడుతున్నాడు. అతడికి తోడుగా ఒలీ పోప్ (10*; 16 బంతుల్లో) ఉన్నాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 445 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా (112; 225 బంతుల్లో), రోహిత్ శర్మ(131; 196 బంతుల్లో) శతకాలతో కదంతొక్కారు. సర్ఫరాజ్ ఖాన్ (62; 66 బంతుల్లో) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
ధ్రువ్ జురెల్(46; 104 బంతుల్లో), రవిచంద్రన్ అశ్విన్(37; 89 బంతుల్లో ) ఆకట్టుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ నాలుగు వికెట్లు, రెహ్మన్ అహ్మద్ రెండు, జేమ్స్ అండర్సన్, టామ్ హార్ట్లీ, జో రూట్ తలో వికెట్ తీశారు. 326/5 ఓవర్నైట్ స్కోర్తో భారత్ రెండో రోజు ఆటను ప్రారంభించిన సంగతి తెలిసిందే.