టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ ఆగమనం అదిరింది. అరంగేట్ర టెస్టులోనే నిప్పులు చెరిగే బంతులతో సత్తాచాటుతున్నాడు. అతడి ధాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టడానికి పోటీపడ్డారు. తన తొలి స్పెల్లోనే మూడు వికెట్లు తీసి తానెంతటి ప్రమాదకర బౌలరో ప్రపంచానికి ఆకాశ్ దీప్ చాటిచెప్పాడు.
యువ పేసర్ ఆకాశ్ దీప్కు తోడుగా రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా కూడా రాణించడంతో నాలుగో టెస్టు తొలి రోజు టీ విరామానికి ఇంగ్లండ్ అయిదు వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. ప్రస్తుతం జో రూట్ (67*), బెన్ ఫోక్స్ (28*) క్రీజులో ఉన్నారు.

అయితే ఆకాద్ దీప్ భారత టెస్టు క్యాప్ తీసుకునే సమయంలో రాంచీ స్టేడియం ఉద్వేగభరితంగా మారింది. టెస్టు క్యాప్ను అందజేసిన టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్తో పాటు ఆకాశ్ దీప్, తన కుటుంబం భావోద్వేగానికి గురయ్యారు. ఆకాశ్ దీప్ గురించి మాట్లాడుతూ ద్రవిడ్ ఎమోషనల్ అయ్యాడు. కష్టాల కడలి దాటుకుని వచ్చిన ఆకాశ్ను ఈ క్షణాన్ని ఆస్వాదించమని ద్రవిడ్ స్పీచ్ ఇచ్చాడు.
''బడ్డీ అనే ప్రాంతం నుంచి ఆకాశ్ దీప్ ప్రయాణం మొదలైంది. రాంచీ నుంది సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఆ ప్రాంతం ఉంది. ఆకాశ్ దీప్.. నీ ప్రయాణంలో ఎన్నో కష్టాలను దాటుకొనివచ్చావు. ఎంతో శ్రమించావు. ఒడిదొడుకులు ఎదుర్కొంటూ జీవితంలో ఎత్తుపల్లాలు చూశావు. అవిరామంగా పోరాడావు. క్రికెట్ కోసం బడ్డీ నుంచి ఢిల్లీకి వెళ్లావు. 2007లో భారత్ టీ20 ప్రపంచకప్ గెలవడం నీకు స్ఫూర్తిరగిలించింది. ఢిల్లీలో ఉండి కష్టపడ్డావు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి కోల్కతాకు చేరుకున్నావు''
''దేశవాళీ క్రికెట్లో ఆకట్టుకునే ప్రదర్శనతో అదరగొట్టావు. నీ ప్రయాణం చివరకు రాంచీ చేరింది. ఇక్కడ నుంచి నీ సొంతూరు 200 కి.మీ దూరంలోనే ఉంది. ఈ రోజు టీమిండియా క్యాప్ను అందుకుంటున్నావు. ఈ మధురక్షణాన మీ తల్లి, మీ కుటుంబం నీతో పాటు ఉండటం స్పెషల్ ఫీలింగ్. కానీ దురదృష్టవశాత్తు మీ తండ్రి, మీ అన్నయ్య ఈ లోకాన్ని విడిచారు. కానీ ఎక్కడున్నా వాళ్ల ఆశీర్వాదం నీకు తప్పకుండా ఉంటుంది''
''అరంగేట్రం చేస్తున్న నీకు టీమిండియా శుభాకాంక్షలు చెబుతుది. ఈ క్షణాన్ని, మ్యాచ్ను ఆస్వాదించు. కష్టాల కడలి దాటి కలను నెరవేర్చుకున్నావు. నీ కల సాకారమైన ఈ క్షణంలో నీతో మేమంతా ఉండడటం సంతోషంగా ఉంది. నీ కోసం క్యాప్ నంబర్ 313 అందిస్తున్నా'' అని ద్రవిడ్ తన ప్రసంగాన్ని ముగించాడు. దీనికి సంబంధించిన వీడియో బీసీసీఐ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
రెండేళ్ల క్రితమే ఐపీఎల్లో ఆర్సీబీ ద్వారా భారత క్రికెట్కు పరిచయమైన ఆకాశ్ దీప్.. ఇప్పటి వరకు తన మార్క్ చూపించలేదు. కానీ దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణించి టీమిండియా పిలుపు అందుకున్నాడు. క్రికెటర్ అవుతానంటే ముందుగా అతని తండ్రే ఒప్పుకోలేదు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఒత్తిడి చేశాడు. కానీ ఆకాశ్ దీప్ మాత్రం ఆటపై మక్కువతో ఉద్యోగం చేసుకుంటూ ఓ లోకల్ అకాడమీలో చేరాడు. తన పేస్తో అందర్నీ ఆకట్టుకున్నా ముందడుగు వేయలేకపోయాడు.
అదే సమయంలోనే అతని తండ్రి గుండెపోటుతో మరణించాడు. మరో రెండు నెలల వ్యవధిలో సోదరుడిని కూడా కోల్పోయాడు. దాంతో ఆకాశ్ దీప్ కష్టాలు రెట్టింపు అయ్యాయి. దాదాపు మూడేళ్ల పాటు అతను క్రికెట్కు దూరమయ్యాడు. కానీ తనకు ఇష్టమైన ఆట అతన్ని వెంటాడింది. మళ్లీ బంతిని పట్టుకొని మైదానంలో దిగేలా చేసింది. దాంతో కోల్కతాకు వెళ్లిన అతను ఓ చిన్న గదిలో అద్దెకు దిగాడు. 2019లో బెంగాల్ అండర్ 23 జట్టు తరఫున బరిలోకి దిగాడు. అనంతరం ఆ జట్టు తరఫున రంజీ క్రికెట్ ఆడాడు. రంజీలో నిలకడగా రాణించి భారత జట్టులోకి వచ్చాడు.