ఇంగ్లండ్తో జరిగిన అయిదు టెస్టుల సిరీస్ను భారత్ 4-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి టెస్టులో ఓటమి అనంతరం టీమిండియా వరుస విజయాలు సాధించి సత్తాచాటింది. బజ్బాల్తో ఎగిరెగిరి పడుతున్న ఇంగ్లండ్ను రోహిత్సేన చిత్తుచిత్తుగా ఓడించింది. విజయంలో బ్యాటర్లతో పాటు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలకపాత్ర పోషించాడు. సిరీస్లో 26 వికెట్లు పడగొట్టాడు.
ఈ నేపథ్యంలో అశ్విన్ను దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కొనియాడాడు. అశ్విన్ ఎదుర్కోవడానికి బ్యాటర్లు వందల సార్లు ఆలోచిస్తున్నారని అన్నాడు. ఆఖరి టెస్టు ప్రారంభానికి ముందు ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ కూడా అశ్విన్ ఎదుర్కోవాలంటే కష్టతరమని పేర్కొన్నాడని గుర్తుచేశాడు. అశ్విన్తో గవాస్కర్ మాట్లాడాడు.

''నువ్వు ఎప్పుడూ ఆటలో విద్యార్థిలా ఉంటావు. ప్రతి మ్యాచ్లో మరింత మెరుగవ్వాలని విభిన్న బంతులతో సిద్ధమవుతుంటాం. డిఫ్రెంట్ యాక్షన్స్తో డిఫ్రెంట్ రన్ అప్తో వస్తుంటాం. బ్యాటర్లను కంగుతినిపించడానికి ప్రయత్నిస్తుంటావు. దాన్ని చూడటం ఎంతో బాగుంటుంది. స్పిన్ను బాగానే ఆడే మంచి ప్లేయర్లు కూడా నిన్ను ఎదుర్కోవడానికి వందల సార్లు ఆలోచిస్తున్నారు. ధర్మశాల టెస్టు ముందు నీ గురించి జో రూట్ చెప్పిన మాటలు అందరికీ తెలిసిందే'' అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు.
దానికి అశ్విన్ బదులిస్తూ.. ''మనం ఒకే శైలిలో బౌలింగ్కు వస్తే బ్యాటర్లు దానికి సిద్ధంగా ఉంటూ చక్కగా బదులిస్తారు. అలాగే బ్యాటర్లు కూడా ఒకే స్టైల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. కొన్ని స్పెల్స్లో గుడ్ లెంగ్త్తో వాళ్లకు సమాధానం ఇవ్వొచ్చు. కానీ నాణ్యమైన బ్యాటర్లను ఔట్ చేయడానికి అది సరిపోదు. అలా అనీ ఒకే విధానంతో ఉంటూ ఫలితాన్ని రాబట్టలేమని చెప్పట్లేదు. కానీ నేను ప్రయోగాలకు, నా మేలు కలిగించేవి నేర్చుకోవడానికి ఇష్టపడతాను.అన్ని చోట్ల ఫుటేజీతో అనాలసిస్ చేస్తున్న ఈ తరుణంలో మనం టాప్లో ఉండటమే మంచిది'' అని తెలిపాడు.
ధర్మశాల టెస్టుతో అశ్విన్ తన కెరీర్లో 100 టెస్టుల మైలురాయిని చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ స్పెషల్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో నాలుగు, రెండో ఇన్నింగ్స్లో అయిదు వికెట్లు సాధించాడు.