
లండన్: ఓవల్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు ఆసక్తికరంగా మారింది. 62 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను ఓలి పోప్ (159 బంతుల్లో 6 ఫోర్లతో 81), క్రిస్ వోక్స్ (60 బంతుల్లో 11 ఫోర్లతో 50) తమ బ్యాటింగ్తో ఆదుకున్నారు. దీంతో ఇంగ్లండ్ రెండో రోజైన శుక్రవారం 84 ఓవర్లలో 290 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా ఇంగ్లండ్ జట్టుకు 99 పరుగుల ఆధిక్యం లభించింది. ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్ను ఆరంభించింది. ఓపెనర్లు రాహుల్ (22 బ్యాటింగ్), రోహిత్ శర్మ (20 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అప్పటికే రోహిత్ ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. శుక్రవారం రెండో రోజు ఆట ముగిసేసరికి 16 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా భారత్ 43 పరుగులు చేసింది.
అయితే రెండో రోజు ఆటలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్మన్ ఓలీ పోప్ సెంచరీకి చేరువగా వచ్చి ఔటయ్యానన్న కోపంతో బ్యాట్ను నేలకేసి కొట్టాడు. ఇన్నింగ్స్ 77వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. భారత .ఆల్రౌండర్ శార్ధూల్ ఠాకూర్ వేసిన ఆ ఓవర్ తొలి బంతికే పోప్ ఔటయ్యాడు. శార్దూల్ వేసిన బంతిని పోప్ ఆడే ప్రయత్నం చేయగా.. బంతి బ్యాట్ ఎడ్జ్ను తాకి వికెట్లను గిరాటేసింది. దీంతో కోపం పట్టలేక తన బ్యాట్ను నేలకేసి కొడుతూ నిరాశగా వెనుదిరిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు బిన్నంగా స్పందిస్తున్నారు.
62 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడంతో భారత్కే ఆధిక్యం దక్కుతుందేమో అన్న ఆశలు రేగాయి. కానీ భారత్ ఆశలను ఓలీ పోప్ చిదిమేశాడు. ఈ సిరీస్లో తొలి మ్యాచ్ ఆడే అవకాశం దక్కించుకున్న పోప్.. ఇంగ్లీష్ జట్టును ఆదుకున్నాడు. ఈ క్రమంలోనే భారత బౌలర్లకు కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. క్రీజులో పాతుకుపోయిన పోప్.. జానీ బెయిర్స్టో (37; 77 బంతుల్లో 7×4), మొయిన్ అలీ (35; 71 బంతుల్లో 7×4), క్రిస్ వోక్స్ (50; 60 బంతుల్లో 11×4)లతో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. బెయిర్స్టోతో అతడి భాగస్వామ్యమే (89 పరుగులు) మ్యాచ్పై భారత్ పట్టు కోల్పోయేలా చేసింది. వికెట్ కోసం భారత్ నిరీక్షణకు సిరాజ్ తెరదించాడు. బెయిర్స్టోను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఇక్కడి నుంచైనా వికెట్ల పతనం వేగమందుకుంటుందేమో అనుకుంటే.. పోప్కు మొయిన్ అలీ తోడయ్యాడు. మరో వికెట్ కోసం భారత్ ఇంకో 20 ఓవర్లకు పైగా నిరీక్షించాల్సి వచ్చింది.
మరికొద్ది సేపట్లో మూడో రోజు ఆరంభం కానుంది. లండన్లోవాతావరణం ప్రస్తుతం మబ్బులు పట్టిఉంది. మధ్యాహ్నం 2 గంటల వరకు ఆకాశం మేఘావృతం అయి ఉంది. మ్యాచ్ సమయానికి ముందు చిరుజల్లులు పడే అవకాశం ఉందని సమాచారం. అయితే మ్యాచ్ ఆగేంతగా వర్షం పడదని తెలుస్తోంది. ఇక మొదటి సెషన్ అనంతరం ఎండకాస్తుందని లండన్ వాతావరణ శాఖ పేర్కొంది. రెండు, మూడు సెషన్ల ఆటకు ఎలాంటి వర్షపు ముప్పులేదు. అయితే పిచ్ పూర్తిగా పేసర్లకు అనుకూలించే అవకాశం ఉంది. పిచ్పై ఉన్న తేమ ఉపయోగించుకుని ఇంగ్లండ్ పేసర్లు ఉదయం చెలరేగనున్నారు. ఇది భారత బ్యాట్స్మెన్కు కష్టమనే చెప్పాలి. ఓపెనర్లు రాహుల్, రోహిత్ మొదటి సెషన్లో నిలబడితే.. మ్యాచుపై భారత్ పట్టుసాధించొచ్చు.