బజ్బాల్ అప్రోచ్తో వికెట్లు కోల్పోతున్నామనే కారణాలను చూపించడం ఇక ఆపెయ్యాలని ఇంగ్లండ్ను ఆ జట్టు మాజీ క్రికెటర్ నాజర్ హుస్సేన్ విమర్శించాడు. ఇంగ్లండ్ బ్యాటర్లు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కోలేకపోతున్నారని తెలిపాడు. అయిదు టెస్టుల సిరీస్లో భాగంగా ధర్మశాల వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 218 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.
175/3తో మెరుగైన స్థితిలోనే ఉన్న ఇంగ్లండ్ చివరి ఏడు వికెట్లను 43 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. రెండో సెషన్లోనే ఏకంగా ఆరు వికెట్లు కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ (5/72), రవిచంద్రన్ అశ్విన్ (4/51) సత్తాచాటారు. దీనిపై నాజర్ హుస్సేన్ మాట్లాడుతూ.. ''గత రెండు మ్యాచ్ల్లోనూ గెలిచే అవకాశాలు వచ్చినా ఇంగ్లండ్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. తొలి రోజు ఆటలోని రెండో సెషన్.. ఈ సిరీస్లోనే ఇంగ్లండ్కు అత్యంత నిరాశపరిచే సెషన్. 175/3 నుంచి 175/6తో మిడిలార్డర్ దారుణంగా విఫలమైంది. ఈ ప్రదర్శన రిపీట్ అవుతూనే ఉంది. ఇది ఇంగ్లండ్ను తీవ్ర ఆందోళనకు గురిచేసే అంశం''

''ఇంగ్లండ్ ఆటగాళ్లు తమ ఆటను మెరుగుపర్చుకోవడానికి ప్రయత్నించాలి. మీ కెప్టెన్, కోచ్ ప్లాన్స్ ఏమైనప్పటికీ రవిచంద్రన్ అశ్విన్ వంటి గొప్ప ప్లేయర్లను ఎదుర్కోవాలంటే ఆటను మరింత మెరుగుపర్చుకోవాలి. జాక్ క్రాలే బాగానే ఆడుతున్నాడు. కానీ అతను 50-80 పరుగుల మధ్య ఔటవ్వడం ఇది ఆరోసారి. జానీ బెయిర్స్టో దూకుడుగా ఆడుతూ 20-30 పరుగులు చేసి పెవిలియన్కు వెళ్తున్నాడు. కుల్దీప్ బంతుల్ని బెన్స్టోక్స్ అర్థం చేసుకోలేకపోతున్నాడు. బ్యాటింగ్లో సత్తాచాటలేకపోతున్నాడు. ఇక్కడ సమస్య బ్యాటింగ్. పరిస్థితులు కాదు''
''కోచ్, కెప్టెన్ సలహాలు ఇస్తుంటారు. మీరు ఇతరుల మాటలను వదిలేసి మీ ఆటను మెరుగుపర్చుకోండి. ఉత్తమ క్రికెటర్గా ఎలా అవ్వాలో ఆలోచించండి. భారత పర్యటన ముగిసేలోపు అవుతారని భావిస్తున్నాను. బజ్బాల్ అని కారణాలు చెప్పకుండా, మానసికంగా, ఆట పరంగా మీ ప్రదర్శన మెరుగుపర్చుకోండి'' అని నాజర్ హుస్సేన్ పేర్కొన్నాడు. తొలి రోజు ఆట ముగిసేసరికి భారత్ వికెట్ కోల్పోయి 135 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (52*), గిల్ (26*) క్రీజులో ఉన్నారు.