టెస్టు ఫార్మాట్ కంటే ఐపీఎల్పైనే ఆసక్తి చూపించే ఆటగాళ్లకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పరోక్షంగా కఠినమైన సందేశాన్ని పంపాడు. టెస్టు క్రికెట్ ఆడాలనే కసి ఉన్న వారికే భారత జట్టులో అవకాశాలు వస్తాయని రోహిత్ చెప్పాడు. మానసిక అలసట కారణంగా జట్టుకు దూరమైన ఇషాన్ కిషన్ను దృష్టిలో పెట్టుకొని రోహిత్ ఈ వ్యాఖ్యలు చేశాడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలో ఇషాన్ కిషన్ జట్టు నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అతడు తిరిగి భారత జట్టులోకి రావాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలని చెప్పినప్పటికీ ఇషాన్ లెక్కచేయలేదు. అంతేగాక టీమిండియాకు దూరంగా ఉన్న సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లంతా రంజీ ట్రోఫీలో పాల్గొనాలని బీసీసీఐ ఆదేశాలు జారీచేసింది. అయినప్పటికీ ఇషాన్ కిషన్ రంజీలో బరిలోకి దిగలేదు.

మరోవైపు బీసీసీఐ ఆదేశాలతో రుతురాజ్ గైక్వాడ్ రంజీట్రోఫీ ఆడాడు. కానీ దీపక్ చాహర్, శ్రేయస్ అయ్యర్ ఆడలేదు. తొలుత గాయాల సాకు చూపించి శ్రేయస్ అయ్యర్ తప్పించుకున్నాడు. కానీ ఆ తర్వాత శ్రేయస్ అడ్డంగా దొరికిపోయాడు. మ్యాచ్ ఆడలేని తీవ్ర గాయాలు శ్రేయస్కు లేవని బీసీసీఐకి ఎన్సీఏ నివేదిక పంపింది. ఐపీఎల్లో సత్తాచాటాలనే ఈ యువ క్రికెటర్లు రెడ్ బాల్ క్రికెట్పై ఆసక్తి చూపట్లేదని విమర్శలు వస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో రోహిత్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ''టెస్టు ఫార్మాట్ అత్యంత కఠినమైంది. టెస్టు క్రికెట్ ఆడాలంటే ఆటగాళ్లలో కసి ఉండాలి. అలా ఆకలితో ఉన్న వారికే అవకాశాలు వస్తాయి. లేని వాళ్లకు అవకాశాలు ఇవ్వడంలో అసలు అర్థమే లేదు. ప్రస్తుత భారత జట్టులోని ఆటగాళ్లలో సుదీర్ఘ ఫార్మాట్ పట్ల తపన కనిపిస్తోంది. అయితే టెస్టుల్లో అవకాశాలు తక్కువగానే వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. విఫలమైన వాళ్లు బయటికి వెళ్లిపోవాల్సిందే'' అని రోహిత్ చెప్పాడు.
ఇంగ్లండ్తో తొలి రెండు టెస్టులు ఆడిన శ్రేయస్ అయ్యర్ చివరి మూడు టెస్టులకు ఎంపిక కాని విషయం తెలిసిందే. గాయం కారణంగా శ్రేయస్ ఎంపిక కాలేదని తొలుత భావించారంతా. కానీ అతడి పేలవ ప్రదర్శనే కారణమని తర్వాత తెలిసింది.