
నాటింగ్హామ్: ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా భారత్తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో నాలుగో రోజు శనివారం ఇంగ్లండ్కు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఓవర్నైట్ స్కోరు 25/0తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆతిథ్య ఇంగ్లండ్ 12 పరుగులు మాత్రమే జోడించి తొలి వికెట్ కోల్పోయింది. మొహ్మద్ సిరాజ్ బౌలింగ్లో ఓపెనర్ రోరీ బర్న్స్ (18) వికెట్ల వెనక దొరికిపోయాడు. ఆ తర్వాత కాసేపటికే జాక్ క్రాలీ కూడా ఔట్ అయ్యాడు. 6 పరుగులు మాత్రమే చేసిన క్రాలీ.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో కీపర్ రిషబ్ పంత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ జట్టుకు శుభారంభం దక్కలేదు. ఆట ప్రారంభమైన కాసేపటికే మొహ్మద్ సిరాజ్ బౌలింగ్లో 18 పరుగులు చేసిన రోరీ బర్న్స్ రిషబ్ పంత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా 17వ ఓవర్ చివరి బంతికి జాక్ క్రాలీని వెనక్కి పంపాడు. దీంతో ఇంగ్లండ్ వరుస ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ డామ్ సిబ్లీ నిలకడగా ఆడుతున్నాడు. అప్పుడే క్రీజులోకి వచ్చిన ఇంగ్లీష్ కెప్టెన్ జో రూట్ గేరు మార్చాడు. వరుసగా బౌండరీలు బాదుతూ జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్తున్నాడు. సిరాజ్ వేసిన 22వ ఓవర్లో అతడు రెండు బౌండరీలు బాదాడు.
జో రూట్, డామ్ సిబ్లీలు భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. సింగిల్స్ తీస్తూ బౌలర్లపై ఒత్తిడి తెస్తున్నారు. ముఖ్యంగా రూట్ వేగంగా ఆడే ప్రయత్నం చేస్తున్నాడు. శార్ధూల్ ఠాకూర్ వేసిన 31.4 ఓవర్లో సిబ్లీ బతికిపోయాడు. సిబ్లీ వికెట్ల ముందు దొరికిపోయినట్లు కనిపించడంతో.. టీమిండియా అప్పీల్ చేయగా అంపైర్ ఔటిచ్చాడు. అయితే సిబ్లీ రివ్యూకు వెళ్లగా.. అక్కడ నాటౌట్గా తేలింది. దాంతో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇద్దరూ ఇప్పటివరకు 56 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇంగ్లండ్ ప్రస్తుతం ఆధిక్యంలోకి వెళ్ళింది. రూట్ (41), సిబ్లీ (25) పరుగులతో ఆడుతున్నారు. ఇంగ్లండ్ 35 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 102 రన్స్ చేసింది.
ఇంగ్లండ్, భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు డ్రా అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆటకు పదేపదే వర్షం అంతరాయం కలిగిస్తుండడంతో మూడు రోజుల ఆట పూర్తైంది. ఇక నాలుగో రోజు ఆటలోనూ వరుణుడి ముప్పు పొంచి ఉంది. నాలుగో రోజు సాయత్రం కూడా వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. అంతకముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 278 పరుగులకు ఆలౌట్ కావడంతో 95 పరుగుల ఆధిక్యం లభించింది.