
ఆదిలోనే రెండు వికెట్లు:
276/3 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజైన శుక్రవారం భారత్ తొలి ఇన్నింగ్స్ ఆటను కొనసాగించింది. సెంచరీ హీరో కేఎల్ రాహుల్ (129; 250 బంతుల్లో 12x4, 1x6) రెండు పరుగులు చేసి ఔటయ్యాడు. రెండో రోజు ఆట ప్రారంభమైన రెండో బంతికే ఔటయ్యాడు. మరుసటి ఓవర్లో వైస్ కెప్టెన్ అజింక్య రహానే (1) పెవిలియన్ చేరాడు. ఓలి రాబిన్సన్ వేసిన తొలి ఓవర్ రెండో బంతికే రాహుల్.. సిబ్లీ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత జేమ్స్ అండర్సన్ వేసిన మరుసటి ఓవర్లోనే రహానే.. జో రూట్ చేతికి చిక్కాడు. దాంతో మ్యాచ్ ప్రారంభమైన రెండు ఓవర్లకే భారత్ 282/5తో నిలిచింది. కీలక వికెట్లు కోల్పోయిన భారత్ కష్టాల్లో పడింది.

మెరిసిన పంత్, జడేజా:
అనంతరం రవీంద్ర జడేజా (40; 120 బంతుల్లో 3x4)తో జోడీ కట్టిన రిషబ్ పంత్ (37; 58 బంతుల్లో 5x4) వేగంగా పరుగులు తీశాడు. దీంతో భారత స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. స్ట్రైక్ రొటేట్ చేస్తూ.. ఇద్దరూ మంచి సమన్వయంతో ఆడారు. ఈ క్రమ్మలో పంత్, జడేజాలు ఆరో వికెట్కు కీలక 49 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే పంత్ కుదురుకున్నట్లే కనిపించగా అనూహ్యంగా మార్క్ వుడ్ బౌలింగ్లో ఔటయ్యాడు. అతడు కీపర్కు క్యాచ్ ఇవ్వడంతో భారత్ 331 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. మరుసటి ఓవర్లోనే మొహ్మద్ షమీ (0) కూడా పెవిలియన్ చేరాడు.

364 పరుగులకు ఆలౌట్:
ఆపై జోడీ కట్టిన రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ మరో వికెట్ పడకుండా తొలి సెషన్ను పూర్తి చేశారు. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 116 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 346 పరుగులు చేసింది. బ్రేక్ అనంతరం జడేజా, ఇషాంత్ కాసేపు క్రీజులో నిలిచారు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి ఎనిమిదో వికెట్కు 26 పరుగులు జోడించారు. అయితే 362 పరుగుల వద్ద ఇషాంత్ (8) ఔటవ్వగా.. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా డకౌట్ అయ్యాడు. అనంతరం జడేజా సైతం ఎక్కువసేపు నిలవలేదు. సిరాజ్ (0) నాటౌట్గా నిలిచాడు. భారత్ 364 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లీష్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ ఐదు వికెట్లు తీయగా.. ఓలి రాబిన్సన్, మార్క్ వుడ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మోయిన్ అలీ ఒక వికెట్ తీశాడు.

ఆదుకున్న రూట్, బర్న్స్:
తొలి ఇనింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మొహ్మద్ సిరాజ్ వేసిన 15వ ఓవర్లో డామ్ సిబ్లీ (11), హసీబ్ హమీద్ (0) ఔటయ్యారు. ఆ తర్వాత జోడీ కట్టిన జో రూట్, రోరి బర్న్స్ నిలకడగా ఆడుతూ భారత బౌలర్లపై ఆదిపత్యం చెలాయించారు. వీరిద్దరూ చెత్త బంతులను బౌండరీలు పంపుతూ ఇన్నింగ్స్ను గాడిలో పెట్టారు. వీరిద్దరూ మూడో వికెట్కు 85 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రమాదకరంగా మారుతున్న సమయంలో బర్న్స్ను షమీ ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. దాంతో ఇంగ్లండ్ 108 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. అనంతరం రూట్, బెయిర్స్టోలు మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. ఇక మూడో రోజు భారత బౌలర్లు రూట్, బెయిర్స్టోను ఎంత త్వరగా ఔట్ చేస్తే మ్యాచ్పై అంత పట్టు సాధించవచ్చు.

39 ఏళ్ల 14 రోజుల వయసులో:
ఈ మ్యాచులో ఇంగ్లండ్ సీనియర్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు. దాంతో గత 70 ఏళ్లలో ఈ ఘనత సాధించిన అత్యంత పెద్ద వయస్కుడైన పేసర్గా రికార్డుల్లోకెక్కాడు. టెస్టు క్రికెట్లో అతి పెద్ద వయసులో ఒక ఇన్నింగ్స్లో 5 వికెట్లు సాధించిన రికార్డు దక్షిణాఫ్రికా ప్లేయర్ జెఫ్ చబ్ పేరిట ఉంది. 1951లో ఇంగ్లండ్తో మాంచెస్టర్లో జరిగిన టెస్టులో చబ్ ఐదు వికెట్లు పడగొట్టాడు. అప్పటికి అతడి వయసు 40 ఏళ్ల 86 రోజులు. 70 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు జేమ్స్ అండర్సన్ 39 ఏళ్ల 14 రోజుల వయసులో ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు. టెస్టులో ఐదు వికెట్ల ఘనత సాధించడం అండర్సన్కు ఇది 31వ సారి. తొలి రోజు రోహిత్ శర్మ, చతేశ్వర్ పుజారాను ఔట్ చేసిన అండర్సన్.. రెండో రోజు అజింక్య రహానే, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం అండర్సన్ వయసు 39 ఏళ్లు. ఈ వయసులో కూడా తనలో ఏమాత్రం పదును తగ్గలేదని మరోసారి నిరూపించుకున్నాడు. బుల్లెట్ బంతులతో బ్యాట్స్మన్కు చుక్కలు చూపిస్తున్నాడు.


Click it and Unblock the Notifications












