రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు పెను ప్రమాదం తప్పింది. ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ వేసిన రాకాసి బౌన్సర్ రోహిత్ తలకు బలంగా తాకింది. కానీ హెల్మెట్ గ్రిల్స్ హిట్ మ్యాన్కు తీవ్ర గాయం కాకుండా రక్షణగా నిలిచాయి.
సాధారణంగా బౌన్సర్లను రోహిత్ శర్మ పుల్ షాట్లతో ఎదుర్కొంటాడు. వాటిని బౌండరీలు, సిక్సర్లుగా మలచడానికి ప్రయత్నిస్తాడు. కానీ టీమిండియా 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడటంతో ఇవాళ తన శైలికి విరుద్ధంగా బ్యాటింగ్ చేశాడు. వికెట్ను చేజార్చుకోకుండా బంతుల్ని డిఫెండ్ చేశాడు. ఈ క్రమంలోనే మార్క్ వుడ్ వేసిన బంతిని డిఫెండ్కు ట్రై చేసి తలకు తాకిచ్చుకున్నాడు.

అయితే ఆ బౌన్సర్ ఊహించని ఎత్తుకు రావడంతో హెల్మెంట్కు బలంగా తాకింది. అప్పటికీ రోహిత్ గాల్లోకి ఎగురుతూ డిఫెండ్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. కాగా, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు శుభారంభం లభించలేదు. 9 ఓవర్లలోపే మూడు వికెట్లు కోల్పోయింది. యువ బ్యాటర్లు తీవ్ర నిరాశపరిచారు. యశస్వీ జైస్వాల్ (10; 10 బంతుల్లో), శుభ్మన్ గిల్ ( డకౌట్; 9 బంతుల్లో), రజత్ పటిదార్ (5; 15 బంతుల్లో) చెత్తషాట్లు ఆడి వికెట్లు చేజార్చుకున్నారు.
ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన రవీంద్ర జడేజా (24; 44 బంతుల్లో) కలిసి రోహిత్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. లంచ్ విరామం వరకు మరో వికెట్ పడకుండా స్కోరుబోర్డు ముందుకు నడిపించాడు. 71 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. ఎనిమిది ఫోర్లు బాదాడు. జడ్డూతో కలిసి నాలుగో వికెట్కు అభేద్యమైన 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
అయితే వ్యక్తిగత స్కోరు 29 వద్ద రోహిత్ శర్మకు లైఫ్ లభించింది. టామ్ హర్ట్లీ బౌలింగ్లో షాట్కు యత్నించగా ఎడ్జ్ తీసుకుని బాల్ స్లిప్ దిశగా వెళ్లింది. కానీ స్లిప్లో ఉన్న జో రూట్ దాన్ని అందుకోలేకపోయాడు. కాసేపటికే అండర్సన్ బౌలింగ్లో రోహిత్ ఎల్బీడబ్ల్యూగా అంపైర్ ప్రకటించాడు. కానీ రోహిత్ రివ్యూ కోరాడు. థర్డ్ అంపైర్ నాటౌట్గా వెల్లడించాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 25 ఓవర్లకు 93/3. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ రెండు వికెట్లు, టామ్ హర్ట్లీ ఒక వికెట్ తీశాడు.