రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ (91; 154 బంతుల్లో) సెంచరీ కోల్పోయాడు. దురదృష్టవశాత్తు రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. కుల్దీప్ యాదవ్ (27; 91 బంతుల్లో) తప్పిదానికి గిల్ పెవిలియన్కు చేరాల్సి వచ్చింది. 64వ ఓవర్ వేసిన టామ్ హర్ట్లీ బౌలింగ్లో కుల్దీప్ షాట్కు యత్నించాడు.
మిడాన్ మీదగా కుల్దీప్ షాట్ ఆడాడు. ఈ లోపు గిల్ను కుల్దీప్ రన్కు పిలిచాడు. కానీ బెన్ స్టోక్స్ బంతిని అందుకోవడం చూసి వద్దని చెప్పాడు. అప్పటికే పిచ్ సగం దూరం వరకు వెళ్లిన గిల్ తిరిగి క్రీజు వద్దకు పరిగెత్తాడు. డైవ్ చేస్తూ బ్యాటును క్రీజులో పెట్టడానికి ప్రయత్నించాడు. కానీ అప్పటికే స్టోక్స్ అందించిన బంతిని అందుకున్న హర్ట్లీ బెయిల్స్ను పడొగొట్టాడు.

అనంతరం కుల్దీప్ తన తప్పుని అంగీకరిస్తూ మోకాళ్లపై కూర్చొని తల దించుకొని బాధపడ్డాడు. మరోవైపు గిల్ అసహనం వ్యక్తం చేస్తూ మైదానాన్ని వీడాడు. తొలి ఇన్నింగ్స్లో డకౌట్ అయిన గిల్ సెకండ్ ఇన్నింగ్స్లో సెంచరీ దిశగా సాగాడు. కానీ బ్యాడ్లక్తో అందుకోలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్లో సర్ఫరాజ్ ఖాన్ కూడా జడేజా తప్పిదానికి రనౌట్ అయిన విషయం తెలిసిందే.
కాగా, ఓవర్నైట్ స్కోరు 196/2తో ఇవాళ ఆటను ఆరంభించిన టీమిండియా 75 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. క్రీజులో యశస్వీ జైస్వాల్ (126; 156 బంతుల్లో), సర్ఫరాజ్ ఖాన్ (2) ఉన్నారు. ఇంగ్లండ్ కంటే భారత్ 397 పరుగుల ఆధిక్యంలో ఉంది. శనివారం ఆట ముగిసేసమయానికి యశస్వి జైస్వాల్ 104 పరుగుల వద్ద రిటైర్డ్హర్ట్గా వెనుదిరిగిన విషయం తెలిసిందే.
మరోవైపు అత్యవసర వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరమైన సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తిరిగొస్తున్నాడని బీసీసీఐ తెలిపింది. ఆదివారం ఆటకు అందుబాటులో ఉండనున్నానడని ప్రకటించింది.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: 445
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 319