ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టులో టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వికెట్ల వేట కొనసాగిస్తున్నాడు. బ్యాటింగ్కు అనుకూలించే పిచ్ సంచలన బౌలింగ్తో ఆకట్టుకుంటున్నాడు. కుల్దీప్ విసురుతున్న గింగరాలు తిరిగే బంతులకు ఇంగ్లిష్ బ్యాటర్ల వద్ద సమాధానం లభించట్లేదు. కుల్దీప్ ధాటికి 187 పరుగులకే ఇంగ్లండ్ ఎనిమిది వికెట్లు కోల్పోయింది.
కుల్దీప్ యాదవ్ అయిదు వికెట్లతో సత్తాచాటాడు. ఇంగ్లండ్ వికెట్ల పతనానికి కుల్దీప్ నాంది పలికాడు. తన తొలి ఓవర్లోనే బెన్ డకెట్ (27; 58 బంతుల్లో)ను ఔట్ చేశాడు. ఆ తర్వాత వరుసగా వికెట్ల తీస్తూ రికార్డు సృష్టించాడు. తన టెస్టు కెరీర్లో 50 వికెట్లు సాధించాడు. ఈ క్రమంలో కుల్దీప్ చరిత్ర సృష్టించాడు.

టెస్టుల్లో 50 వికెట్లు వేగంగా తీసిన భారత బౌలర్గా కుల్దీప్ యాదవ్ చరిత్రకెక్కాడు. 1871 బంతుల్లోనే 50 వికెట్ల మార్క్ను అందుకున్నాడు. ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. అక్షర్ 2205 బంతుల్లో, బుమ్రా 2520 బంతుల్లో హాఫ్సెంచరీ వికెట్లు సాధించారు.
కాగా, డకెట్, జాక్ క్రాలే (79; 108 బంతుల్లో), ఒలీ పోప్ (11; 24 బంతుల్లో), జానీ బెయిర్స్టో (29; 18 బంతుల్లో), బెన్స్టోక్స్ (0; 6 బంతుల్లో)ను తొలి ఇన్నింగ్స్లో కుల్దీప్ ఔట్ చేశాడు. క్రాలేను స్టన్నింగ్ డెలివరీతో కుల్దీప్ క్లీన్బౌల్డ్ చేశాడు. 10.9 డిగ్రీల పాటు బంతిని టర్న్ చేయడం విశేషం. అయితే తన కెరీర్లో 100వ టెస్టు ఆడుతున్న బెయిర్స్టోను ఔట్ చేసే అవకాశాన్ని తొలుత కుల్దీప్ కోల్పోయాడు. బెయిర్స్టో ఇచ్చిన స్ట్రాంగ్ రిటర్న్ క్యాచ్ను కుల్దీప్ అందుకోలేకపోయాడు. కానీ కాసేపటికీ ఔట్ చేసి లెక్కసరిచేశాడు.
టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ అయిదు వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ రెండు, రవీంద్రజడేజా ఒక్క వికెట్ తీశారు. రవిచంద్రన్ అశ్విన్ కూడా తన కెరీర్లో ఇవాళ 100వ టెస్టు ఆడుతున్న విషయం తెలిసిందే. కాగా, ఈ ఫ్లాట్ పిచ్పై భారత పేసర్లు బుమ్రా, సిరాజ్ వికెట్ సాధించలేదు.