
లండన్: ఇంగ్లండ్తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. జేమ్స్ అండర్సన్ వేసిన 50వ ఓవర్ చివరి బంతికి చేతేశ్వర్ పుజారా స్లిప్లో జానీ బెయిర్స్టో చేతికి చిక్కాడు. దాంతో భారత్ 150 పరుగుల వద్ద రెండో వికెట్ నష్టపోయింది. మరో రెండు ఓవర్ల అనంతరం అంపైర్లు టీ బ్రేక్ ప్రకటించారు. తేనేటి విరామ సమయానికి భారత్ 52 ఓవర్లకు 157/2తో నిలిచింది. దీంతో రెండో సెషన్ పూర్తయింది. ఈ సెషన్లో భారత్ 33.2 ఓవర్లు బ్యాటింగ్ చేసి 111 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (83), పుజారా (9) వికెట్లు కోల్పోయింది. కేఎల్ రాహుల్ (55), విరాట్ కోహ్లీ (0) క్రీజులో ఉన్నారు.
లండన్లో ఉదయం నుంచి వాతావరణ ప్రశాంతంగానే ఉండటంతో రెండో టెస్ట్ మ్యాచ్ సవ్యంగానే సాగుతుందని అంతా ఆశించారు. సరిగ్గా టాస్కు ముందే చినుకులు మొదలవ్వడంతో లార్డ్స్ మైదానం సిబ్బంది కవర్లు కప్పేశారు. కాసేపటికి వర్షం ఆగడంతో టాస్ 20 నిముషాలు ఆలస్యంగా పడింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో భారత్ బ్యాటింగ్ ఆరంభించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ఆరంభంలో ఆచితూచి ఆడారు. వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. వాతావరణం మేఘావృతమై పేస్ బౌలర్లకు అనుకూలిస్తున్నా.. ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటున్నారు.
ఇన్నింగ్స్ ఆరంభంలో లోకేష్ రాహుల్ డిఫెన్స్కే పరిమితం అయ్యాడు. చెత్త షాట్లకు పోకుండా వికెట్ కాపాడుకున్నాడు. అయితే క్రీజులో కుదురుకున్న రోహిత్ శర్మ.. సామ్ కరన్ను టార్గెట్ చేసి ఆడాడు. అతడు వేసిన ఓ ఓవర్లో ఏకంగా నాలుగు బౌండరీలు బాదాడు. అనంతరం కూడా అతడిని వదలలేదు. దాంతో భారత్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అయితే 18.4 ఓవర్ల ఆట అయిన తర్వాత మరోసారి వర్షం పడటంతో అంపైర్లు ఆటను నిలిపేశారు. అంపైర్లు త్వరగానే లంచ్ బ్రేక్ ఇచ్చారు. భోజన విరామ సమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 46 పరుగులు చేసింది.
లంచ్ అనంతరం మరింత జోరు పెంచిన రోహిత్ శర్మ ఫోర్లు బాదుతూ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓలి రాబిన్సన్ వేసిన 25 ఓవర్ ఇదో బంతికి సింగల్ తీసిన హిట్మ్యాన్ 50 పరుగులు పూర్తిచేశాడు. మొత్తం 83 బంతులు ఎదుర్కొన్న రోహిత్.. 8 ఫోర్ల సాయంతో అర్ధ శతకం నమోదు చేశాడు. టెస్టుల్లో శర్మకు ఇది 13వ ఫిఫ్టీ. మరోవైపు కేఎల్ రాహుల్ నిదానంగా ఆడుతూ రోహిత్కు సహకరించాడు. అయితే 43.4వ ఓవర్లో జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్లో రోహిత్ (83; 145 బంతుల్లో 11x4, 1x6) బౌల్డయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన చేతేశ్వర్ పుజారా (9; 23 బంతుల్లో 1x4) మరోసారి నిరాశపరిచాడు. అండర్సన్ వేసిన 50వ ఓవర్ చివరిక బంతికి స్లిప్లో బెయిర్స్టో చేతికి చిక్కాడు. దాంతో భారత్ 150 పరుగుల వద్ద రెండో వికెట్ నష్టపోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ అండతో రాహుల్ (55 నాటౌట్; 143 బంతుల్లో 3x4, 1x6) హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు. ఓలి రాబిన్సన్ వేసిన 50.4 ఓవర్కు మూడు పరుగులు తీసి ఈ సిరీస్లో రెండో అర్ధ శతకం సాధించాడు. టీ బ్రేక్ సమయానికి 157/2తో నిలిచింది.