
లండన్: ఐదు టెస్ట్ మ్యాచుల సిరీస్లో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలిరోజు అట ముగిసింది. తొలిరోజు ముగిసేసరికి భారత్ 90 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (127; 248 బంతుల్లో 12x4, 1x6), వైస్ కెప్టెన్ అజింక్య రహానే (1; 22 బంతుల్లో) క్రీజులో ఉన్నారు. రాహుల్ 'సూపర్' సెంచరీతో మెరవగా.. మరో ఓపెనర్ రోహిత్ శర్మ (83; 145 బంతుల్లో 11x4, 1x6) సెంచరీ కోల్పోయాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ (43; 103 బంతుల్లో 3x4) చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడగా.. టెస్ట్ స్పెసలిస్ట్ చేతేశ్వర్ పుజారా మాత్రం (9; 23 బంతుల్లో 1x4) మరోసారి నిరాశపరిచాడు. ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ రెండు వికెట్లు పడగొట్టారు. తొలిరోజులో టీమిండియానే ఆధిపత్యం చెలాయించింది. ఇక భారత్ భారీ స్కోర్పై కన్నేసింది. రెండో రోజు కూడా ఇలానే ఆడితే.. భారత్ పటిష్ట స్థితిలో నిలిచే అవకాశం ఉంది. ధాటిగా ఆడగల రిషబ్ పంత్, రవీంద్ర జడేజాలు ఉండడం కలిసొచ్చే అంశం.
20 నిముషాలు ఆలస్యంగా:
లండన్లో ఉదయం నుంచి వాతావరణ ప్రశాంతంగానే ఉండటంతో రెండో టెస్ట్ మ్యాచ్ సజావుగా సాగుతుందని అందరూ అనుకున్నారు. సరిగ్గా టాస్కు ముందే చినుకులు మొదలవ్వడంతో.. మ్యాచ్ 20 నిముషాలు ఆలస్యంగా మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో భారత్ బ్యాటింగ్ ఆరంభించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ఆరంభంలో ఆచితూచి ఆడారు. వికెట్ పడకుండా ఎంతో జాగ్రత్తపడ్డారు. వాతావరణం మేఘావృతమవడం, వర్షం పడడంతో పిచ్ పేస్ బౌలర్లకు అనుకూలించినా.. ఇంగ్లండ్ బౌలర్లను భారత ఓపెనింగ్ జోడి సమర్థంగా ఎదుర్కొంది.
క్రీజులో కుదురుకున్నాక:
ఇన్నింగ్స్ ఆరంభంలో లోకేష్ రాహుల్ డిఫెన్స్కే పరిమితం అయ్యాడు. చెత్త షాట్లకు పోకుండా వికెట్ కాపాడుకున్నాడు. అయితే క్రీజులో కుదురుకున్న రోహిత్ శర్మ.. మాత్రం ఒక్కసారిగా చెలరేగిపోయాడు. సామ్ కరన్ను టార్గెట్ చేసి ఆడాడు. అతడు వేసిన ఓ ఓవర్లో ఏకంగా నాలుగు బౌండరీలు బాదాడు. ఆపై కూడా అతడిని వదలలేదు. దాంతో భారత్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అయితే 18.4 ఓవర్ల ఆట అయిన తర్వాత మరోసారి వర్షం పడటంతో.. అంపైర్లు ఆటను నిలిపేశారు. దీంతో ప్లేయర్స్ త్వరగానే లంచ్ బ్రేక్కు వెళ్లారు. భోజన విరామ సమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 46 పరుగులు చేసింది.
రోహిత్ అర్ధ శతకం:
లంచ్ అనంతరం మరింత జోరు పెంచిన రోహిత్ శర్మ ఫోర్లు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 83 బంతులు ఎదుర్కొన్న రోహిత్.. 8 ఫోర్ల సాయంతో అర్ధ శతకం నమోదు చేశాడు. టెస్టుల్లో శర్మకు ఇది 13వ ఫిఫ్టీ. మరోవైపు కేఎల్ రాహుల్ నిదానంగా ఆడుతూ రోహిత్కు సహకరించాడు. అయితే 43.4వ ఓవర్లో జేమ్స్ అండర్సన్ బౌలింగ్లో రోహిత్ బౌల్డయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన చేతేశ్వర్ పుజారా (9; 23 బంతుల్లో 1x4) మరోసారి నిరాశపరిచాడు. అండర్సన్ బౌలింగ్లో స్లిప్లో జానీ బెయిర్స్టో చేతికి చిక్కాడు. దాంతో భారత్ 150 పరుగుల వద్ద రెండో వికెట్ నష్టపోయింది. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీ అండతో రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు. ఓలి రాబిన్సన్ వేసిన 50.4 ఓవర్కు మూడు పరుగులు తీసి ఈ సిరీస్లో రెండో అర్ధ శతకం సాధించాడు. టీ బ్రేక్ సమయానికి భారత్ 157/2తో నిలిచింది.
రాహుల్ సెంచరీ:
మూడో సెషన్లో కేఎల్ రాహుల్ గేర్ మార్చాడు. బౌండరీలు బాదుతూ ఇంగ్లండ్ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. 212 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకుని తాను ఎంత విలువైన ఆటగాడు నిరూపించాడు. అంతేకాదు లార్డ్స్ మైదానంలో సెంచరీ సాధించిన మూడో భారత ఓపెనర్గా రాహుల్ ఘనత సాధించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ ఆచితూచి ఆడుతో రాహుల్కు అండగా నిలిచాడు. హాఫ్ సెంచరీకి చేరువైన టీమిండియా కెప్టెన్.. ఓలి రాబిన్సన్ బౌలింగ్లో క్యాచ్ ఔట్ అయ్యాడు దాంతో 267 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. అనంతరం రాహుల్కు జత కలిసిన రహానే మరో వికెట్ పడకుండా రోజును ముగించారు.
మూడో భారత ఓపెనర్గా:
తొలి టెస్టులో శతకం కోల్పోయిన కేఎల్ రాహుల్ రెండో మ్యాచ్లో దాన్ని అందిపుచ్చుకున్నాడు. దాంతో ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో శతకం బాదిన మూడో భారత ఓపెనర్గా కొత్త రికార్డు నెలకొల్పాడు. తకుముందు రవిశాస్త్రి (1990), వినోద్ మన్కడ్ (1952)లు మాత్రమే లార్డ్స్లో సెంచరీ సాధించిన భారత ఓపెనర్లు కాగా.. వారి సరసన ఇప్పుడు రాహుల్ చేరిపోయాడు. ఆసియా బయట టెస్టు ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఓపెనర్ల జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్తో కలిసి రాహుల్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో సునీల్ గవాస్కర్ 15 సెంచరీలతో తొలి స్థానంలో ఉండగా.. సెహ్వాగ్-రాహుల్లు తలో నాలుగు సెంచరీలు సాధించారు. ఆ తర్వాత స్థానంలో వినోద్ మన్కడ్-రవిశాస్త్రిలు తలో మూడు సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నారు.