IND vs ENG: లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్ జట్టుతో మూడో టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ఆట భారత్ తడబాటుతో ముగిసింది. 193 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదిస్తున్న టీమిండియా.. ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 58 పరుగులు మాత్రమే చేసింది. ఈ నేపథ్యంలో చివరి ఓవర్లో నైట్ వాచ్మెన్ ఆకాష్ దీప్కు స్ట్రైక్ ఇచ్చిన కేఎల్ రాహుల్ నిర్ణయం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది.
వివాదాస్పద సింగిల్
నాలుగో రోజు ఆట చివరి ఓవర్ను ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వేశాడు. అప్పుడు క్రీజులో ఉన్న కేఎల్ రాహుల్ .. ఆ ఓవర్లోని నాలుగో బంతికి ఒక పరుగు తీసి నైట్ వాచ్మెన్గా క్రీజులోకి వచ్చిన ఆకాష్ దీప్కు స్ట్రైక్ ఇచ్చాడు. అయితే కేఎల్ రాహుల్ సింగిల్ తీయడంతో తదుపరి బంతిని ఎదుర్కొన్న ఆకాష్ దీప్.. బెన్ స్టోక్స్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యి వెనుదిరిగాడు. దీనితో కేఎల్ రాహుల్ చివరి కొన్ని బంతులను తానే ఎదుర్కొని వికెట్ను కాపాడుకోవాల్సిందని కొందరు అభిమానుల వాదన.

నైట్ వాచ్మెన్ పాత్ర
టెస్ట్ క్రికెట్లో ఒక రోజు ఆట ముగియబోతున్నప్పుడు బౌలింగ్కు అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు కీలక బ్యాటర్లను రక్షించడానికి లోయర్ ఆర్డర్ బ్యాటర్లను బ్యాటింగ్కు పంపడం సాధారణం. వీరినే "నైట్ వాచ్మెన్" అని పిలుస్తారు. వీరి ప్రధాన కర్తవ్యం ఆ రోజు మిగిలిన బంతులను ఎదుర్కొని వికెట్ పడకుండా చూసుకోవడం. ఆకాష్ దీప్ తన పనిని చేయడానికి ప్రయత్నించినప్పటికీ కేఎల్ రాహుల్ తప్పు అంచనా కారణంగా ఔట్ కావాల్సి వచ్చింది.
ఈ సంఘటనతో భారత జట్టు మరో వికెట్ను కోల్పోయి కష్టతరమైన స్థితిలో ఉంది. మ్యాచ్ చివరి రోజున విజయానికి ఇంకా 135 పరుగులు అవసరం కాగా.. చేతిలో 6 వికెట్లు మాత్రమే ఉన్నాయి. కేఎల్ రాహుల్ ఈ నిర్ణయం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపుతుందో లేదో వేచి చూడాలి.