వైజాగ్ టెస్టులో సెంచరీ సాధించిన టీమిండియా యువ బ్యాటర్ శుభ్మన్ గిల్కు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ థ్యాంక్స్ చెప్పాడు. తమ దేశంపై ప్రత్యర్థి ఆటగాడు శతకం సాధిస్తే ఎవరైనా ఆటను విశ్లేషిస్తూ అభినందనలు తెలుపుతారు. కానీ ధన్యవాదాలు చెప్పడమేంటని ఆలోచిస్తున్నారా? దానికో కారణం ఉంది. అసలేం జరిగిదంటే..
గత కొన్నాళ్లుగా గిల్ ఫామ్ కోల్పోయిన విషయం తెలిసిందే. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ అనంతరం ఇవాళ ఇన్నింగ్స్ మినహాయిస్తే గిల్ ప్రదర్శన తీసికట్టుగా ఉంది. 12 ఇన్నింగ్స్ల్లో 207 పరుగులే చేశాడు. అత్యధిక స్కోరు 36 పరుగులు, సగటు కేవలం 18. దీంతో గిల్పై విమర్శలు పెద్దఎత్తున వచ్చాయి. జట్టులో అతడిని తప్పించాలనే డిమాండ్ పెరిగింది. దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్తో సహా క్రికెట్ విశ్లేషకులు గిల్ ఆటను విమర్శిస్తూ పరుగులు సాధించాలని సూచించారు.

కానీ కెవిన్ పీటర్సన్ మాత్రం గిల్పై నమ్మకం ఉంచాడు. దక్షిణాఫ్రికా దిగ్గజ ఆలరౌండర్ కలిస్ కూడా కెరీర్ ఆరంభంలో విఫలమయ్యాడని, కానీ అంతిమంగా ఉత్తమ టెస్టు క్రికెటర్గా నిలిచాడని పీటర్సన్ అన్నాడు. ''తొలి 10 టెస్టుల్లో కలిస్ సగటు 22 మాత్రమే. కానీ ఆ తర్వాత క్రికెట్లో అత్యుత్తమ ప్లేయర్గా సత్తాచాటాడు. గిల్కు కాస్త సమయం ఇవ్వండి'' అని పీటర్సన్ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ చేసిన 48 గంటల్లోపే గిల్ సెంచరీ సాధించాడు. దీంతో తన నమ్మకాన్ని నిలబెట్టినందకు 'థ్యాంక్యూ గిల్' అంటూ పీటర్సన్ మరో ట్వీట్ చేశాడు.
వైజాగ్ టెస్టు రెండో ఇన్నింగ్స్లో గిల్ 147 బంతుల్లో 104 పరుగులు చేశాడు. అతడి పోరాటంతోనే టీమిండియా 255 పరుగులు చేయగలిగింది. ఆదివారం ఆట ప్రారంభమైన కాసేపటికే భారత్ ఓపెనర్లు ఔటైనా గిల్ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. శ్రేయస్ అయ్యర్ (29; 52 బంతుల్లో)తో కలిసి మూడో వికెట్కు 81 పరుగులు జోడించాడు. అంతేగాక అక్షర్ పటేల్ (45; 84 బంతుల్లో)తో కలిసి అయిదో వికెట్ 89 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
కాగా, 399 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ మూడో రోజు ఆట ముగిసేసరికి వికెట్ కోల్పోయి 67 పరుగులు చేసింది.క్రీజులో జాక్ క్రాలే (29*; 50 బంతుల్లో), రెహాన్ అహ్మద్ (9*; 8 బంతుల్లో) ఉన్నారు. బెన్ డకెట్ (28; 27 బంతుల్లో)ను అశ్విన్ ఔట్ చేశాడు. విజయానికి భారత్ తొమ్మిది వికెట్ల దూరంలో, ఇంగ్లండ్ 332 పరుగుల దూరంలో ఉన్నాయి.