
లండన్: టెస్టు క్రికెట్ కోసం విరాట్ కోహ్లీ తపన పడటం ఎంతో బాగుంది అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ అన్నాడు. టెస్ట్ ఫార్మాట్ తనకెంత విలువైందో మైదానంలో కోహ్లీ ఉత్సాహం, అభిరుచి తెలియజేస్తున్నాయని పేర్కొన్నాడు. అచ్చం తనలానే కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్ అంటే మక్కువ చూపిస్తాడన్నాడు. కోహ్లీ అభిరుచి టెస్టు క్రికెట్పై అందరికీ ప్రేమను పెంచుతోందని కేపీ వెల్లడించాడు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ వంటి దిగ్గజాల బాటలో అతడు నడుస్తున్నాడని పేర్కొన్నాడు. ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.
తాజాగా కెవిన్ పీటర్సన్ మాట్లాడుతూ... 'విరాట్ కోహ్లీ నా తరహాలోనే ఉన్నాడు. అతడు తన హీరోల దారిలో నడుస్తున్నాడని నేను అనుకుంటున్నా. సుదీర్ఘ ఫార్మాట్లోని సచిన్ టెండ్యూలర్, రాహుల్ ద్రవిడ్ తరహా దిగ్గజాల బాటలోనే అతడూ అడుగులు వేస్తున్నాడు. నిజానికి కోహ్లీనే ఒక దిగ్గజం. టెస్ట్ ఫార్మాట్లోనే కాకుండా అతడు టీ20ల్లోనూ రాణించాల్సి ఉంటుంది. అందుకే అతడు టెస్టులకు అమిత ప్రాధాన్యం ఇస్తున్నాడు. అలాంటి అంతర్జాతీయ స్టార్ సుదీర్ఘ ఫార్మాట్ కోసం తపన పడటం ఎంతో బాగుంది' అని అన్నాడు.
'అన్ని రకాల పరిస్థితుల్లో తన జట్టు గెలుపునకు విరాట్ కోహ్లీ విలువిస్తాడు. అందుకే ఆస్ట్రేలియాలో భారత్ గెలవడం మనం చూశాం. ఇప్పుడు ఇంగ్లండ్ పైనా ఆధిక్యం సాధించారు. లార్డ్స్లో విజయం అతడిని కచ్చితంగా సంతృప్తి పరిచే ఉంటుంది. అతడి ఉత్సాహం, తీవ్రత, జట్టును నడిపించే తీరు మనం గమనించొచ్చు. అతడు సుదీర్ఘ ఫార్మాట్కు ఎంతో విలువిస్తాడు. లార్డ్స్ తరహా విజయాలు అతడి వారసత్వాన్ని నిర్వచిస్తాయి' అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ తెలిపాడు.

'సాధారణంగా ఉపఖండం జట్లకు ఇంగ్లండ్లో ఆడటం చాలా కష్టం. ఒకవేళ ట్రెంట్ బ్రిడ్జ్లో వర్షం గనక పడకుంటే.. భారత్ బహుశా 2-0తో ఆధిక్యంలోకి వెళ్లొచ్చు. ఐదో రోజు మహ్మద్ సిరాజ్ బౌలింగ్ చేసిన తీరు అద్భుతం. అతడెంతో తీవ్రతతో నాణ్యమైన బౌలింగ్ చేశాడు. ఆతిథ్య జట్టు కవ్వింపులకు దిగినా.. ఘాటుగా బదులివ్వడం టెస్టు క్రికెట్పై భారత జట్టుకు ఉన్న ప్రేమను తెలియజేస్తోంది. ఇప్పుడు ఇంగ్లండ్ జట్టులో చాలా మార్పులు అవసరం' అని కేపీ సూచించాడు.
ఆగస్టు 25 నుంచి లీడ్స్ వేదికగా మూడో టెస్టు జరగనుంది. మూడో టెస్ట్ మ్యాచుకు భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు. ఇంగ్లండ్ మాత్రం టీ20 స్పెసలిస్ట్ డేవిడ్ మలాన్ను జట్టులోకి తీసుకుంది. టాప్ ఆర్డర్ బ్యాట్స్మన్ చివరి రెండు టెస్టుల్లో తడబడిన కారణంగా మలన్కు ఆహ్వానం అందింది. అలాగే బ్యాట్స్మెన్ డామ్ సిబ్లే, జాక్ క్రాలేను పక్కనపెట్టింది. దీంతో వీరు తిరిగి తమ కౌంటీ జట్లకు ఆడనున్నారు. జాక్ లీచ్ పేరును కూడా స్క్వాడ్లో ప్రస్తావించలేదు. కానీ స్టార్ ఆల్రౌండర్ మొయిన్ అలీకి ప్రత్యామ్నాయంగా ఇతడు జట్టుతోనే ఉండనున్నాడు. ఇక సీమర్ సాకిబ్ మహమూద్కూ చోటు కల్పించారు.