బెయిర్స్టో అద్భుత క్యాచ్:
రెండో ఇన్నింగ్స్లో ఓపెనర్ కేఎల్ రాహుల్ (8) మరోసారి నిరాశపరిచాడు. రోహిత్ శర్మ అడపాదడపా షాట్లు ఆడినా.. రాహుల్ మాత్రం పూర్తిగా డిఫెన్స్కే పరిమితమయ్యాడు. ఎంతలా అంటే.. 54 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేశాడు. ఎంతో ఓపిగ్గా ఆడిన రాహుల్.. మరో బంతి అయితే తొలి సెషన్ ముగుస్తుందనగా స్లిప్లో జానీ బెయిర్స్టో పట్టిన అద్భుత క్యాచ్కు ఔటయ్యాడు. క్రెయిగ్ ఓవర్టన్ వేసిన 18.6 ఓవర్కు రాహుల్ స్లిప్లో దొరికిపోయాడు. ఎడమవైపు వెళ్తున్న బంతిని బెయిర్స్టో అమాంతం డైవ్ చేస్తూ ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు. బ్యాకప్ ఉన్నా కూడా బెయిర్స్టో సాహసం చేసి స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు.

స్టన్నింగ్ క్యాచ్:
జానీ బెయిర్స్టో క్యాచ్ పట్టిన తీరు చూసి కామెంటేటర్లు సైతం ఆశ్చర్యపోయారు. వావ్.. వాట్ ఏ స్టన్నింగ్ క్యాచ్ అని పేర్కొన్నారు. క్యాచ్ పట్టిన బెయిర్స్టో కూడా నవ్వులు పూయించాడు. సహచర ఆటగాళ్లు కూడా బెయిర్స్టోను అభినందనలతో ముంచెత్తాడు. ఈ వీడియోను ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తమ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. మీరూ ఆ వీడియోను చూసి ఆస్వాదించండి. వీడియో చూసిన నెటిజన్లు 'స్టన్నింగ్ క్యాచ్' అంటూ పొగిడేస్తున్నారు. 'ఫెంటాస్టిక్ క్యాచ్', 'సూపర్ క్యాచ్' అంటూ ఫాన్స్ పొగిడేస్తున్నారు.

రివ్యూ తీసుకున్నా:
అంతకుముందు లోకేష్ రాహుల్ రివ్యూ తీసుకుని ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఓలి రాబిన్సన్ వేసిన 10వ ఓవర్ నాలుగో బంతి రాహుల్ ప్యాడ్లను తాకడంతో ఇంగ్లీష్ ఆటగాళ్లు అప్పీల్ చేశారు. ఫీల్డ్ ఎంపైర్ వెంటనే ఎల్బీగా ఔట్ ఇచ్చాడు. రాహుల్ రివ్యూ తీసుకోవాలా అనే సందేహంలో ఉండగా.. రోహిత్ శర్మ అతడికి మద్దుతుగా నిలిచాడు. దీంతో రాహుల్ రివ్యూ కోరాడు. రిప్లైలో రాహుల్ నాటౌట్ అని తేలింది. పిచింగ్ ఔట్ సైడ్ మరియు బంతి వికెట్లను మిస్ అవ్వడంతో థర్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. దీంతో ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకుని.. రాహుల్ను నాటౌట్గా ప్రకటించాడు. దీంతో రాహుల్ ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అంపైర్ నిర్ణయం వెలుబడగానే రోహిత్ శర్మకు రాహుల్ ధన్యవాదాలు చెప్పాడు. అందుకు రోహిత్ షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు.

కోల్కతా టెస్టు తరహాలో పోరాడాలి:
2001 కోల్కతా టెస్టు తరహాలో అద్భుత పోరాట పటిమ ప్రదర్శించిన భారత్ శనివారం కూడా ఇదే జోరు కొనసాగిస్తే.. ఈ మ్యాచ్లో టీమిండియాకు మెరుగైన అవకాశాలు ఉంటాయి. శుక్రవారం 80 ఓవర్ల పాటు క్రీజులో నిలిచి 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 215 పరుగులు చేసిన కోహ్లీ సేన నాలుగో రోజూ ఇదే ఆటతీరు కనబరిస్తే.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరును దాటేయడంతో పాటు ప్రత్యర్థి ముందు మంచి లక్ష్యాన్ని నిలపవచ్చు. ప్రస్తుతానికి ఓపెనర్లు పెవిలియన్ చేరిపోగా.. విరాట్ కోహ్లీ, చేతేశ్వర్ పుజారా తర్వాత అజింక్యా రహానే, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా బ్యాటింగ్కు రానున్నారు. పుజారా వీలైనంత ఎక్కువసేపు క్రీజులో నిలిస్తేనే భారత్ ఈ మ్యాచ్ను కాపాడుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి. కోహ్లీ, పుజారా, రహానే రెండు సెషన్ల పాటు ఇంగ్లిష్ బౌలర్లను అడ్డుకోగలిగితే.. పంత్, జడేజా ప్రత్యర్థికి మెరుగైన లక్ష్యాన్ని నిర్దేశించే చాన్స్ ఉంది.


Click it and Unblock the Notifications












