రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమిండియా ఆదిలోనే మొదటి వికెట్ కోల్పోయింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో సెంచరీతో జట్టును ఆదుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ (19; 28 బంతుల్లో) ఈ సారి నిరాశపరిచాడు. జో రూట్ బౌలింగ్లో స్వీప్ షాట్కు యత్నించి వికెట్లు ముందు దొరికిపోయాడు.
అయితే తొలుత అంపైర్ జోయెల్ విల్సన్ నాటౌట్గా ప్రకటించాడు. కానీ ఇంగ్లండ్ రివ్యూకి వెళ్లింది. సమీక్షలో రోహిత్ వికెట్ను సాధించుకుంది. అయితే జోయెల్ విల్సన్ ఈ టెస్టులో ఘోర తప్పిదాలు చేస్తున్నాడు. అతడు ఇచ్చిన నిర్ణయాలు సమీక్షలో థర్డ్ అంపైర్ ఏకీభవించట్లేదు. టీమిండియా తొలి ఇన్నింగ్స్లో జోయెల్ విల్సన్ రెండు తప్పు నిర్ణయాలు వెల్లడించాడు.
అండర్సన్ బౌలింగ్లో రోహిత్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ ఇచ్చాడు. కానీ రివ్యూకి వెళ్లిన రోహిత్ బతికిపోయాడు. టామ్ హర్ట్లీ బౌలింగ్లో సిరాజ్ను కూడా జోయెల్ విల్సన్ ఎల్బీడబ్య్లూగా పేర్కొన్నాడు. సిరాజ్ సమీక్ష కోరాడు. బ్యాటుకు ఎడ్జ్ తీసుకుందని స్పష్టంగా తెలియడంతో చివరికి నాటౌట్ అని తేలింది. అంతేకాదు ఇంగ్లండ్ ఇన్నింగ్స్లోనూ ఒలీ పోప్ (39), బెయిర్స్టో (0)ను తొలుత అంపైర్ నాటౌట్గా ప్రకటించారు. కానీ భారత్ సమీక్షకు వెళ్లి వికెట్లను సాధించుకుంది. ఇలా ఈ టెస్టులో అంపైర్ జోయెల్ విల్సన్ తీసుకున్న నిర్ణయాల్లో చాలా తప్పులున్నాయి.
కాగా, లంచ్ విరామానికి రెండో ఇన్నింగ్స్లో భారత్ 16 ఓవర్లకు వికెట్ కోల్పోయి 44 పరుగులు చేసింది. యశస్వీ జైస్వాల్ (19; 54 బంతుల్లో), శుభ్మన్ గిల్ (5; 14 బంతుల్లో) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 319 పరుగులకు ఆలౌటైంది. ఓవర్నైట్ స్కోరు 207/2తో మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ ఇవాళ ఆటలో మరో 112 పరుగులు మాత్రమే చేసి కుప్పకూలింది. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరమైనప్పటికీ మిగిలిన టీమిండియా బౌలర్లు అదరగొట్టారు.

హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బంతులతో బెంబేలెత్తించడంతో ఇంగ్లండ్ తమ చివరి ఎనిమిది వికెట్లు 95 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. దీంతో భారత్కు తొలి ఇన్నింగ్స్లో 126 పరుగుల ఆధిక్యం లభించింది. శనివారం ఆట ప్రారంభమైన కాసేపటికీ జో రూట్ (18; 31 బంతుల్లో)ను బుమ్రా బోల్తాకొట్టించాడు. తర్వాత ఓవర్లోనే బెయిర్స్టో (0)ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేసి ఇంగ్లండ్ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఈ స్థితిలో బ్యాటింగ్కు వచ్చిన బెన్ స్టోక్స్ (41; 89 బంతుల్లో) కలిసి డకెట్ (153; 151 బంతుల్లో) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో డకెట్ 150 పరుగుల మార్క్ను అందుకున్నాడు.
ఆ తర్వాత కుల్దీప్ డకౌట్ను ఔట్ చేసి ప్రత్యర్థిని మరోసారి దెబ్బకొట్టాడు. అనంతరం భారత్ వెనక్కి తిరిగి చూడలేదు. ఆధిపత్యం చెలాయిస్తూ వరుసగా వికెట్లు తీసింది. సిరాజ్ వికెట్ల వేటకు ఇంగ్లండ్ చివరి నాలుగు వికెట్లను 20 పరుగులకే కోల్పోయింది. భారత్ బౌలర్లలో సిరాజ్ నాలుగు వికెట్లు, కుల్దీప్, జడేజా చెరో రెండు వికెట్లు, బుమ్రా, అశ్విన్ తలో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 445 పరుగులు చేసింది.