నాటింగ్హామ్: ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్ట్ నాలుగో రోజు భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ 40 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. కెప్టెన్ జో రూట్ 56 పరుగులు, ఓపెనర్ డొమినిక్ సిబ్లే 27 పరుగులతో క్రీజులో ఉన్నారు. మూడో వికెట్కి వీరిద్దరు 73 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. భారత్ కంటే ఇంగ్లండ్ ప్రస్తుతం 24 పరుగుల ఆధిక్యంలో ఉంది. నాలుగో రోజు మొదట్లో రెండు వికెట్లు తీసిన భారత బౌలర్లు తర్వాత ఏ మాత్రం ప్రభావం చూపడం లేదు. ఈ సెషన్లో మొత్తం రూట్ సేన 94 పరుగులు జోడించి రెండు వికెట్లు కోల్పోయింది.
నాలుగో రోజు శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ జట్టుకు శుభారంభం దక్కలేదు. ఆట ప్రారంభమైన కాసేపటికే మొహ్మద్ సిరాజ్ బౌలింగ్లో 18 పరుగులు చేసిన ఓపెనర్ రోరీ బర్న్స్ వికెట్ కీపర్ రిషబ్ పంత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా 17వ ఓవర్ చివరి బంతికి జాక్ క్రాలీ (6)ని వెనక్కి పంపాడు. దీంతో ఇంగ్లండ్ వరుస ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ డామ్ సిబ్లీ నిలకడగా ఆడాడు. రెండు వికెట్లు పడినా అప్పుడే క్రీజులోకి వచ్చిన ఇంగ్లీష్ కెప్టెన్ జో రూట్ గేరు మార్చాడు. వరుసగా బౌండరీలు బాదుతూ జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్తున్నాడు.
జో రూట్, డామ్ సిబ్లీలు భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. సింగిల్స్ తీస్తూ బౌలర్లపై ఒత్తిడి తెచ్చారు. ముఖ్యంగా రూట్ వేగంగా ఆడాడు. ఈ క్రమంలోనే చెత్త బంతులను బౌండరీలుగా మార్చాడు. శార్ధూల్ ఠాకూర్ వేసిన 31.4 ఓవర్లో సిబ్లీ బతికిపోయాడు. సిబ్లీ వికెట్ల ముందు దొరికిపోయినట్లు కనిపించడంతో.. టీమిండియా అప్పీల్ చేయగా అంపైర్ ఔటిచ్చాడు. అయితే సిబ్లీ రివ్యూకు వెళ్లగా.. అక్కడ నాటౌట్గా తేలింది. దాంతో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
అనంతరం షమీ వేసిన 38వ ఓవర్ మూడో బంతికి బౌండరీ బాదిన జో రూట్ హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఇక భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ 40 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. కెప్టెన్ జో రూట్ 56 పరుగులు, ఓపెనర్ డొమినిక్ సిబ్లే 27 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి సెషన్ ఆరంభంలో భారత బౌలర్లు ఆధిపత్యం చెలాయించినా.. చివరకు రూట్ సేననే పైచేయి సాధించింది.
ఇంగ్లండ్, భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు డ్రా అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆటకు పదేపదే వర్షం అంతరాయం కలిగిస్తుండడంతో మూడు రోజుల ఆట పూర్తైంది. ఇక నాలుగో రోజు ఆటలోనూ వరుణుడి ముప్పు పొంచి ఉంది. 2-3 రోజుల మాదిరిగానే నాలుగో రోజు సాయత్రం కూడా వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. అంతకముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 278 పరుగులకు ఆలౌట్ కావడంతో 95 పరుగుల ఆధిక్యం లభించింది.
.