రాంచీ వేదికగా భారత్తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ సెంచరీ సాధించాడు. 219 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో తన ఖాతాలో 31వ సెంచరీ వేసుకున్నాడు. బజ్బాల్ను వదిలిసే సెన్స్బాల్తో జాగ్రత్తగా ఆడుతూ స్కోరుబోర్డు ముందుకు నడిపించాడు. తొమ్మిది ఫోర్లు బాదాడు. 119 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును ఆదుకున్నాడు. తొలి రోజు ఆట ముగిసేసరికి జట్టు స్కోరును 302/7కి చేర్చాడు.
ఫామ్ కోల్పోయి విమర్శలు ఎదుర్కొంటున్న జో రూట్ ఎట్టకేలకు సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో పలు రికార్డులు బద్దలుకొట్టాడు. ఇంగ్లండ్ క్రికెట్ చరిత్రలో 19వేల పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇన్నింగ్స్ల పరంగా 19వేల పరుగుల మార్క్ను వేగంగా అందుకున్న నాలుగో ఆటగాడు జో రూట్. 444 ఇన్నింగ్స్లో రూట్ ఈ ఘనత సాధించగా.. తొలి మూడు స్థానాల్లో విరాట్ కోహ్లి (399), సచిన్ టెండూల్కర్ (432), బ్రియాన్ లారా (433) ఉన్నారు.

అంతేగాక జో రూట్ మరో ఘనత సాధించాడు. టెస్టు చరిత్రలో భారత్పై పది శతకాలు బాదిన తొలి క్రికెటర్గా జో రూట్ చరిత్రకెక్కాడు. 52 ఇన్నింగ్స్ల్లో ఈ ఘనత అందుకున్నాడు. జో రూట్ తర్వాత స్థానాల్లో స్టీవ్ స్మిత్ (9 సెంచరీలు- 37 ఇన్నింగ్స్లు), గ్యారీ సోబర్స్ (8 సెంచరీలు - 30 ఇన్నింగ్స్లు), వివ్ రిచర్డ్స్ (8 సెంచరీలు - 31 ఇన్నింగ్స్లు) ఉన్నారు. ఇక అన్ని ఫార్మాట్లలో టీమిండియాపై రూట్కు ఇది 13వ సెంచరీ. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు రికీ పాంటింగ్, స్టీవ్ స్మిత్ ఉన్నారు. వీరిద్దరు టీమిండియాపై 14 శతకాలు బాదారు.
ఇక ఫ్యాబ్-4లో అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన మూడో ఆటగాడిగా జో రూట్ నిలిచాడు. సుదీర్ఘ ఫార్మాట్లో విలియమ్సన్ (32), స్మిత్ (32), రూట్ (31), విరాట్ కోహ్లి (29) సెంచరీలు సాధించారు. కాగా, ప్రస్తుత అంతర్జాతీయ ఆటగాళ్లలో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మతో కలిసి రూట్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి రోహిత్, రూట్ 47 సెంచరీలు సాధించాడు. విరాట్ కోహ్లి (80), డేవిడ్ వార్నర్ (49) టాప్-2లో ఉన్నారు.