
లీడ్స్: ఐదు టెస్ట్ మ్యాచుల సిరీసులో భాగంగా లీడ్స్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. గురువారం అయిన రెండో రోజు ఆటముగిసేసరికి రూట్ సేన తొలి ఇన్నింగ్స్లో 129 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 423 పరుగుల భారీ స్కోర్ చేసింది. క్రేగ్ ఓవర్టన్ (24), ఓలి రాబిన్సన్ (0) నాటౌట్గా నిలిచారు. కెప్టెన్ జో రూట్ (121; 165 బంతుల్లో 14x4) సెంచరీ చేయగా.. డేవిడ్ మలన్ (70; 128 బంతుల్లో 11x4) చేశాడు. దాంతో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 345 పరుగుల ఆధిక్యంతో మ్యాచ్పై పూర్తి పట్టు సాధించింది. మూడో టెస్ట్ దాదాపు భారత్ చేజారినట్టే. కోహ్లీసేన రెండో ఇన్నింగ్స్లో గట్టి పోరాటం చేస్తే తప్ప మ్యాచ్ను కాపాడుకోలేదు. లేదా వరణుడి కరుణిస్తే గాని భారత్ ఓటమినుంచి తప్పించుకోగలదు.
భారీ ఆరంభం:
120/0 ఓవర్నైట్ స్కోర్తో గురువారం ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ నిలకడగా ఆడింది. తొలి రోజే హాఫ్ సెంచరీలు చేసిన ఓపెనర్లు రోరీబర్న్స్ (61; 153 బంతుల్లో 6x4, 1x6), హసీబ్ హమీద్ (68; 195 బంతుల్లో 12x4)లు వికెట్ కాపాడుకున్నారు. ఆచితూచి ఆడుతూ స్కోర్ వేగం పెంచే ప్రయత్నం చేశారు. మొదటగా మొహ్మద్ షమీ.. బర్న్ను బౌల్డ్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 135 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓవర్నైట్ స్కోర్కు ఇంగ్లండ్ ఓపెనర్లు మరో 15 పరుగులు మాత్రమే జోడించారు. అనంతరం హమీద్కు డేవిడ్ మలాన్ జత కలిశాడు. మరో 24 పరుగుల అనంతరం జడేజా.. హమీద్ను బౌల్డ్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 159 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
ఆదుకున్న రూట్:
ఓపెనర్ల అనంతరం జోడీ కట్టిన డేవిడ్ మలన్, జో రూట్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ పరుగులు చేశారు. చెత్త షాట్లకు పోకుండా వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ జోడీని విడదీసేందుకు ఎంత ప్రయత్నించినా.. కుదరలేదు. ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ సిరాజ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఈ క్రమంలో మలన్, రూట్ జోడి మరో వికెట్ పడకుండా తొలి సెషన్ను ముగించారు. లంచ్ సమయానికి ఇంగ్లండ్ ఆధిక్యం 104 పరుగులుగా నమోదైంది.
మలన్ హాఫ్ సెంచరీ:
భోజన విరామ సమయానికి 182/2తో ఉన్న ఇంగ్లండ్ జట్టును రూట్, మలన్ ఆదుకున్నారు. ముఖ్యంగా ఇంగ్లీష్ సారథి వన్డే ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి మలన్ నుంచి పూర్తి సహకారం అందింది. ఈ క్రమంలోనే రూట్ తొలుత అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఆపై మలన్ కూడా వేగంగా పరుగులు సాధించి.. ఈ సిరీస్లో తొలి మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. దాంతో 2012 తర్వాత తొలిసారి ఒకే ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ టాప్ నలుగురు బ్యాట్స్మెన్ అర్ధ శతకాలతో రాణించారు. ఇక టీ బ్రేక్ సమయానికి ముందు మలన్ మూడో వికెట్గా వెనుదిరిగాడు. దాంతో మలన్, రూట్ మధ్య 139 పరుగుల కీలక భాగస్వామ్యంకు తెరపడింది. రెండో సెషన్లో రూట్ సేన మొత్తం 26 ఓవర్లు బ్యాటింగ్ చేసి 116 పరుగులు సాధించి ఒక వికెట్ నష్టపోయింది.
రూట్ శతకం:
టీ బ్రేక్ అనంతరం జో రూట్ శతకం పూర్తి చేశాడు. ఈ సిరీసులో అతడికి ఇది వరుసగా మూడో సెంచరీ. ఆ తర్వాత ఇంగ్లండ్ వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయింది. జానీ బెయిర్స్టో (29), జోస్ బట్లర్(7)ను మొహ్మద్ షమీ ఔట్ చేశాడు. ఆపై రూట్ను బుమ్రా, మొయిన్ అలీ(8)ని జడేజా పెవిలియన్ పంపారు. ఇక మ్యాచ్ ముగిసేముందు సామ్ కరన్ (15) సిరాజ్ బౌలింగ్లో ఔటయ్యాడు. దాంతో ఇంగ్లండ్ ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలోనే ఓవర్టన్, రాబిన్సన్ నాటౌట్గా నిలిచారు. భారత బౌలర్లలో షమీ మూడు.. సిరాజ్, జడేజా చెరో రెండు.. బుమ్రా ఒక వికెట్ తీశారు.