IND vs ENG: మాంచెస్టర్లో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు భారత బౌలర్లను సునాయాసంగా ఎదుర్కొని భారీ స్కోరు దిశగా సాగుతోంది. ప్రస్తుతం 7 వికెట్ల నష్టానికి 544 పరుగులు చేసిన ఇంగ్లాండ్.. తొలి ఇన్నింగ్స్లో భారత్ చేసిన 358 పరుగల కంటే 186 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో ఉండగా.. ఈ కీలక మ్యాచ్లో భారత్ విజయం సాధించాల్సిన ఒత్తిడిలో ఉంది. అయితే భారత బౌలర్ల పేలవ ప్రదర్శన అభిమానులకు నిరాశకు గురిచేసింది.
స్టార్ బౌలర్ల నిరాశజనక ప్రదర్శన
భారత బౌలింగ్ విభాగం ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ముఖ్యంగా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా 28 ఓవర్లలో 95 పరుగులు ఇచ్చి కేవలం ఒక వికెట్ మాత్రమే తీశాడు. అదే విధంగా మహ్మద్ సిరాజ్ కూడా 26 ఓవర్లలో 113 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. అన్షుల్ కాంబోజ్ 18 ఓవర్లలో 89 పరుగులు ఇచ్చి ఒక వికెట్ సాధించాడు. స్పిన్నర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ చెరో రెండు వికెట్లు తీసినప్పటికీ భారీ పరుగులు నియంత్రించడంలో విఫలమయ్యారు.

బుమ్రా పేస్ పతనం
బుమ్రా బౌలింగ్కు వచ్చాడంటే ప్రత్యర్థి బ్యాటర్లు భయపడుతుంటారు. బుమ్రా బౌలింగ్ లో ఆడాలంటే చాలా జాగ్రత్త పడతారు. బౌలింగ్కు సహకరించే పిచ్ అయితే బుమ్రాను అడ్డుకోవడం కష్టమే. కానీ మాంచెస్టర్ టెస్టులో బుమ్రా ప్రభావం పెద్దగా లేదు.భారత బౌలింగ్ దళానికి ప్రధాన ఆయుధమైన బుమ్రా వేగంలో వచ్చిన అసాధారణ క్షీణత అందరినీ కలవరపరుస్తోంది. గణాంకాలు ఈ సమస్యను స్పష్టంగా చూపుతున్నాయి:
తొలి టెస్టు మ్యాచ్లో: బుమ్రా వేసిన మొత్తం బంతుల్లో 39.84 శాతం బంతులు 140 కిలోమీటర్ల వేగం (kmph) పైగా ఉన్నాయి.
లార్డ్స్ టెస్టు మ్యాచ్లో: బుమ్రా తన బౌలింగ్లో కేవలం 26.84 శాతం బంతులు మాత్రమే 140 కి.మీ వేగంతో పైగా వేశాడు.
మాంచెస్టర్ టెస్టు మ్యాచ్లో: అతను కేవలం 0.57 శాతం బంతులు మాత్రమే 140 కి.మీ వేగంతో పైగా వేశాడు. అంటే 173 బంతుల్లో బుమ్రా కేవలం ఒక్క బంతిని మాత్రమే 140 కి.మీ వేగంతో పైగా వేశాడు. దీని ద్వారా భారత జట్టుకు ప్రధాన ఆయుధమైన బుమ్రా వేగం తగ్గుతూ వస్తోంది. ఇదే భారత బౌలింగ్ ప్రభావం చూపకపోవడానికి కారణమని చెప్పబడుతోంది.
ప్రభావం, ఆందోళన
బుమ్రా వేగం ఇలా గణనీయంగా తగ్గడం భారత బౌలింగ్ శక్తికి ఒక పెద్ద మైనస్గా మారింది. ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెట్టే సామర్థ్యంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. భారత బౌలర్లు మ్యాచ్లో ప్రభావం చూపలేకపోవడానికి బుమ్రా వేగం తగ్గడమే ప్రధాన కారణమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కీలక సిరీస్ మధ్యలో బుమ్రా ఫామ్లో ఈ మార్పు, భారత జట్టుకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.