వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ 396 పరుగుల భారీ స్కోరు వద్ద ఆలౌటైంది. ఓవర్నైట్ స్కోరు 336/6తో శనివారం ఆటను ప్రారంభించిన టీమిండియా మరో 60 పరుగులే చేసింది. రెండో రోజు ఆటలోనూ యశస్వీ జైస్వాల్ (209; 290 బంతుల్లో) ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. సాధికారికంగా ఆడుతూ డబుల్ సెంచరీ సాధించాడు. షోయబ్ బషీర్ బౌలింగ్లో బౌండరీ, సిక్సర్ వరుసగా బాది ద్విశతకాన్ని అందుకున్నాడు.
అయితే అంతకుముందు ఓవర్లో రవిచంద్రన్ అశ్విన్ (20; 37 బంతుల్లో)ను జేమ్స్ అండర్సన్ బోల్తా కొట్టించాడు. మరోవైపు డబుల్ సెంచరీ అనంతరం జైస్వాల్ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. అండర్సన్ బౌలింగ్లో బెయిర్స్టోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత టీమిండియా ఆలౌట్ కావడానికి ఎక్కువ సేపు పట్టలేదు. బుమ్రా (6)ను రెహాన్ అహ్మద్, ముకేశ్ కుమార్ (0)ను షోయబ్ బషీర్ ఔట్ చేశారు.

కాగా, భారత్ ఇన్నింగ్స్లో జైస్వాల్ది హైలైట్ ఇన్నింగ్స్. టీమిండియా సాధించిన స్కోరులో సగానికిపైగా జైస్వాలే సాధించడం విశేషం. జైస్వాల్ తర్వాత అత్యధిక స్కోరు శుభ్మన్ గిల్ సాధించిన 34 పరుగులే కావడం గమనార్హం.టీమిండియా బ్యాటర్లలో రోహిత్ శర్మ (14), శ్రేయస్ అయ్యర్ (27), రజత్ పటిదార్ (32), అక్షర్ పటేల్ (27), శ్రీకర్ భరత్ (17), అశ్విన్ (20) పరుగులు చేశారు.
ఇంగ్లండ్ బౌలర్లలో 41 ఏళ్ల అండర్సన్ సత్తాచాటాడు. 25 ఓవర్లు వేసి 47 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అరంగేట్ర బౌలర్ షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్ కూడా చెరో మూడు వికెట్లు తీశారు. అయితే బ్యాటింగ్కు అనుకూలించే వికెట్పై 400 పరుగులు సాధించలేకపోవడం భారత్కు నిరాశ కలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.