IND vs ENG: ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ లార్డ్స్ మైదానంలో గురువారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు 4 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఎప్పుడూ దూకుడుగా ఉండే ఇంగ్లండ్ జట్టు 83 ఓవర్లలో కేవలం 251 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టు ఓవర్కు 3 పరుగుల చొప్పున మాత్రమే పరుగులు సాధించింది. ఆ జట్టులో జో రూట్ 99 పరుగులతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి నాటౌట్గా ఉన్నాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్ 39 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. వారి కంటే ముందు ఓలీ పోప్ 44, బెన్ డకెట్ 23, జాక్ క్రారీ 18, హ్యారీ బ్రూక్ 11 పరుగులు చేసి ఔటయ్యారు. భారత జట్టు బౌలింగ్లో నితీష్ కుమార్ రెడ్డి రెండు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీశారు.
ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు దూకుడుగా కాకుండా టెస్ట్ క్రికెట్కు తగ్గట్టుగా ఆడారు. దూకుడుగా ఆడే ఆటగాడు బెన్ డకెట్ 40 బంతుల్లో 23 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ జాక్ క్రాలీ 43 బంతుల్లో 18 పరుగులు చేసి నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్లో ఒకే ఓవర్లో పెవిలియన్ చేరారు. ఈ పరిస్థితుల్లో ఓలీ పోప్, జో రూట్ పార్టనర్షిప్ నెలకొల్పి బాధ్యతాయుతంగా ఆడారు. నెమ్మదిగా ఆడిన ఓలీ పోప్ 104 బంతుల్లో 44 పరుగులు చేసి జడేజా బౌలింగ్ లో ఔటయ్యాడు. ఈ జోడీ మూడో వికెట్కు 109 పరుగులు జోడించింది. అనంతరం టెస్ట్ ర్యాంకింగ్స్లో ప్రస్తుతం నంబర్ వన్ ఆటగాడిగా ఉన్న హ్యారీ బ్రూక్ క్రీజులోకి వచ్చాడు. అప్పుడు బుమ్రా అతడిని 11 పరుగుల వద్ద ఔట్ చేశాడు.

జడేజా, జో రూట్.. ఓ ఫన్నీ సన్నివేశం
అయితే లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. జో రూట్ 99 పరుగుల వద్ద జడేజా, జో రూట్ మధ్య జరిగిన ఫన్నీ సన్నివేశంతో మైదానంలో నవ్వులు పూశాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. తొలి రోజు చివరి ఓవర్లో జో రూట్ తన 37వ శతకాన్ని పూర్తి చేస్తాడని అందరూ భావించారు. మొదటి రోజు చివరి ఓవర్ను ఆకాశ్ దీప్ బౌలింగ్ చేశాడు. చివరి ఓవర్ నాలుగో బంతిని లెంగ్త్ డెలివరీ వేయగా.. క్రీజులో ఉన్న జో రూట్(98) బంతిని బ్యాక్వర్డ్ వైపు తరలించాడు. అక్కడ ఫీల్డింగ్లో జడేజా ఉన్నాడు. సింగిల్ తీసిన జో రూట్.. రెండో రన్ కూడా తీసేందుకు సిద్ధమయ్యాడు. అప్పటికే బంతి బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న జడేజా చేతిలోకి వెళ్లింది. ఈ క్రమంలో స్టోక్స్ వద్దు.. రావద్దు అంటూ చెప్పాడు. అప్పటికే రెండో పరుగు కోసం రూట్ క్రీజు సగం వరకు వచ్చి వెనక్కి వెళ్తుండగా... అతడిని ఆటపట్టించేలా రవీంద్ర జడేజా బంతిని జారవిడిచినట్లు పడేసి పరుగు తీసుకో అన్నట్లు సైగలు చేశాడు. దీంతో జో రూట్ నవ్వుతూ ముందుకు వెళ్లబోగా.. జడేజా వెంటనే బంతిని మళ్లీ చేతిలోకి తీసుకోవడంతో జో రూట్ వెనక్కు వచ్చాడు. ఒక వేళ జో రూట్ కాస్త ధైర్యం చేసి ముందుకు వెళ్తే జడేజా త్రోకు బలయ్యేవాడని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. అక్కడుంది జడ్డూ భాయ్.. నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం అంటూ పోస్టులు పెడుతున్నారు.