ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా 436 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓవర్నైట్ స్కోరు 421/7తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్ మరో 15 పరుగులు మాత్రమే చేసి చివరి మూడు వికెట్లు కోల్పోయింది. రవీండ్ర జడేజా (87; 180 బంతుల్లో) సెంచరీ, అక్షర్ పటేల్ (44; 100 బంతుల్లో) హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నారు.
శనివారం ఆట ప్రారంభించిన తర్వాత జడేజా, అక్షర్ జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారు. పేసర్ మార్క్ వుడ్, స్పిన్నర్ జో రూట్తో స్టోక్స్ బౌలింగ్ చేయించాడు. మంచి బంతుల్ని గౌరవిస్తూ జడ్డూ, అక్షర్ సింగిల్స్ తీస్తూ స్కోరును సాధించారు. అయితే కాసేపటికీ మార్క్ వుడ్కు బదులుగా జాక్ లీచ్ బంతి అందుకున్నాడు. అక్షర్ రెండు బౌండరీలు బాది లీచ్కు స్వాగతం పలికాడు. కానీ రూట్ వేసిన తర్వాతి ఓవర్లో టీమిండియాకు షాక్ తగిలింది.

రూట్ వేసిన మూడో బంతిని జడేజా డిఫెండ్కు యత్నించగా అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు. జడ్డూ రివ్యూకి వెళ్లినా లాభం లేకపోయింది. తర్వాతి బంతికే బుమ్రాను జో రూట్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత రెహాన్ అహ్మద్ బౌలింగ్లో అక్షర్ పటేల్ కూడా బౌల్డ్ అవ్వడంతో భారత్ ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్లో 190 పరుగుల ఆధిక్యం లభించింది.
టీమిండియా బ్యాటర్లలో యశస్వీ జైశ్వాల్ (80; 74 బంతుల్లో), రోహిత్ శర్మ (24; 27 బంతుల్లో), శుభ్మన్ గిల్ (23; 66 బంతుల్లో), కేఎల్ రాహుల్ (86), శ్రేయస్ అయ్యర్ (35; 63 బంతుల్లో), జడేజా (87), కేఎస్ భరత్ (41; 81 బంతుల్లో), అశ్విన్ (1), అక్షర్ పటేల్ (44) పరుగులు చేశాడు. బుమ్రా డకౌటయ్యాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో జో రూట్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. రెహాన్ అహ్మద్, టామ్ హర్ట్లీ చెరో రెండు వికెట్లు తీశారు.

అంతకుమందు తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 246 పరుగులకు ఆలౌటైంది. బెన్ స్టోక్స్ (70; 88 బంతుల్లో) టాప్ స్కోరర్. డకెల్ (35; 39 బంతుల్లో), బెయిర్ స్టో (37; 58 బంతుల్లో) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో జడేజా, అశ్విన్ చెరో మూడు వికెట్లు, అక్షర్, బుమ్రా తలో రెండు వికెట్లు సాధించారు.