ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఆడకపోవడం సిగ్గుచేటని ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ అండర్స్న్ అన్నాడు. కోహ్లి లేకపోవడంతో ఇంగ్లండ్ అభిమానులకు సంతోషానిస్తుందని, కానీ అత్యుత్తమ ఆటగాళ్లతోనే పోటీపడాలని తాను కోరుకుంటాడని అండర్సన్ పేర్కొన్నాడు. అయిదు టెస్టుల సిరీస్లో మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ 3-1తో సిరీస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ధర్మశాల వేదికగా మార్చి 7 నుంచి ఆఖరి టెస్టు జరగనుంది.
ఈ సుదీర్ఘ సిరీస్కు వ్యక్తిగత కారణాలతో విరాట్ కోహ్లి దూరమయ్యాడు. తొలుత సిరీస్లో పాల్గొనడానికి కోహ్లి ఒప్పుకున్నాడు. తొలి రెండు టెస్టులకు ఎంపికయ్యాడు. ఉప్పల్ వేదికగా జరిగే మొదటి టెస్టు కోసం హైదరాబాద్కు కూడా వచ్చాడు. కానీ అదే రోజు ఇంటికి తిరిగి బయలుదేరాడు. వ్యక్తిగత కారణాలతో కోహ్లి దూరమయ్యాడని బీసీసీఐ వివరణ ఇచ్చింది. అయితే చివరి మూడు టెస్టులకు అయినా కోహ్లి అందుబాటులోకి వస్తాడనకుంటే అభిమానులకే నిరాశే మిగిలింది.

కోహ్లి దూరమవ్వడంపై అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా నిరాశచెందారు. కోహ్లి వర్సెస్ అండర్సన్ పోటీని ఆస్వాదించలేమని బాధపడ్డారు. ఈ నేపథ్యంలో కోహ్లి గురించి అండర్సన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ''అత్యుత్తమ ఆటగాళ్లతో పోటీపడలాని కోరుకుంటాం. కానీ కోహ్లి సిరీస్లో భాగం కాకపోవడం సిగ్గుచేటు. గత కొన్నేళ్లుగా మేం గొప్ప ఫైట్స్ చేశాం. నా వ్యక్తిగతంగా అనే కాదు, జట్టుగా ప్రపంచ అత్యుత్తమ ప్లేయర్లతో ఆడాలనుకుంటాం. కోహ్లి ప్రపంచ అత్యుత్తమ ఆటగాడు''
''కోహ్లి సిరీస్లో లేకపోవడంతో ఇంగ్లండ్ అభిమానులు సంతోషించి ఉంటారు. ఎందుకంటే కోహ్లి అంతటి నాణ్యమైన ప్లేయర్. కానీ మా కోణంలో ఆలోచించండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలంటే ఉత్తమమైన దానితోనే పోటీపడాలి. గత ఏళ్లుగా కోహ్లికి బౌలింగ్ చేయడం నాకు ఛాలెంజింగ్ అనిపించింది. కానీ అతడు ఆడకపోవడం సిగ్గుచేటు'' అని అండర్సన్ అన్నాడు.
ఇప్పటివరకు కోహ్లిని అండర్సన్ పదిసార్లు ఔట్ చేశాడు. మరోవైపు అండర్సన్పై కోహ్లి 331 పరుగులు చేశాడు. కాగా, తన సతీమణి అనుష్కశర్మ రెండోసారి తల్లి అయిన నేపథ్యంలో కోహ్లి కుటుంబంతో సమయాన్ని గడపాలని భావించి సిరీస్కు దూరమయ్యాడు. ఈ స్టార్ జోడి ఫిబ్రవరి 15న పండండి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.