
భారత్ నిర్ణయం సరైందే:
ఐపీఎల్ 2021ను దృష్టిలో పెట్టుకునే ఐదో టెస్టును రద్దు చేసే నిర్ణయం భారత్ తీసుకుందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించిన ఇంజమామ్ ఉల్ హక్.. టీమిండియా నిర్ణయం సరైనదేనని మద్దతు పలికాడు. 'భారత బృందంలో కరోనా కేసుల నేపథ్యంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సిన ఐదో టెస్టు జరగకపోవడం దురదృష్టకరం. అయితే ఈ టెస్టు ఆడకూడదని భారత్ తీసుకున్న నిర్ణయం సరైందే. ఎందుకంటే ఆటగాళ్లలందరూ ఫిజియోతో చాలా సన్నిహితంగా ఉంటారు. అతడికి కరోనా సోకింది. లక్షణాలు 3-4 రోజుల్లో కన్పిస్తాయి. ఇలాంటి సమయంలో మ్యాచ్ ఆడితే ఇంగ్లండ్ ఆటగాళ్లు కూడా చాలా ప్రమాదంలో పడతారు. మ్యాచ్పై భారత్ తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి తప్పు లేదు' అని అన్నాడు.

ట్రెయినర్లు, ఫిజియోలు ఎంతో అవసరం:
'సహాయక సిబ్బంది లేకుండా ఓ జట్టు మైదానంలో దిగడం ఎంతో కష్టం. మ్యాచ్ సమయంల్లో ఎవరైనా వ్యక్తి గాయపడినా, అస్వస్థతకు గురైనా.. ట్రెయినర్లు, ఫిజియోల అవసరం ఉంటుంది. వారి సహాయంతో కోలుకుని తిరిగి మ్యాచ్ ఆడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా టెస్టు మ్యాచ్లో ఓ రోజు ఆట ముగిసిన వెంటనే ఫిజియోల పని మొదలవుతుంది. మరుసటి రోజు ఆట కోసం వారిని సిద్ధంగా ఉంచడమే వారి మొదటి పని. ఫిజియోలు, ట్రెయినర్ల పాత్ర ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు' అని పాక్ మాజీ సారథి ఇంజమామ్ ఉల్ హక్ పేర్కొన్నాడు.

కోచ్, సహాయక సిబ్బంది లేకుండానే:
'దురదృష్టవశాత్తూ భరత్- ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన ఐదో టెస్టు కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయింది. నిజానికి ఇది చాలా గొప్ప సిరీస్. కోచ్, సహాయక సిబ్బంది లేకుండానే భారత జట్టు నాలుగో టెస్టు ఆడింది. మైదానంలో వారు చూపిన ప్రతిభ అసాధారణం. అందరూ బాగా ఆడారు. టీమిండియా బౌలింగ్, బ్యాటింగ్ బాగుంది. అందుకే విదేశాల్లో రాణిస్తోంది' అని ఇంజమామ్ ఉల్ హక్ చెప్పుకొచ్చాడు. ఇంజీ పాక్ తరఫున 120 టెస్టులు, 378 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. ఐదు టెస్ట్ మ్యాచుల సిరీసులో నాలుగు మ్యాచులు ముగియగా.. భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఐదో టెస్ట్ మ్యాచ్ రద్దవడంతో ఈసీబీకి సుమారు రూ.200 కోట్లు నష్టం రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో భవిష్యత్లో ఈ మ్యాచ్ తిరిగి నిర్వహించడానికి బీసీసీఐ ఆసక్తి చూపుతోంది.

కోచ్లకు కరోనా:
టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి తన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి గత వారం హాజరవగా.. అతనితో పాటు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా వెళ్లాడు. అక్కడే రవిశాస్త్రికి కరోనా సోకగా.. అతని నుంచి బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్లకు కూడా వైరస్ సోకింది. అనంతరం ఫిజియో యోగేశ్ పర్మార్ కరోనా వచ్చింది. దాంతో భయాందోళనకి గురైన భారత క్రికెటర్లు ఐదో టెస్టు కోసం మైదానంలోకి వచ్చేందుకు విముఖత ప్రదర్శించారు. భారత క్రికెటర్ల వ్యవహార శైలితో తొలుత ఐదో టెస్టులో మొదటి రోజుని రద్దు చేసిన ఈసీబీ.. ఆటగాళ్లతో మాట్లాడిన తర్వాత మ్యాచ్ మొత్తాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.


Click it and Unblock the Notifications












