ఇంగ్లండ్తో జరుగుతున్న ఆఖరి టెస్టుకు టీమిండియా యువ బ్యాటర్ రజత్ పటిదార్ దూరమయ్యాడు. బుధవారం సాయంత్రం రజత్ గాయపడ్డాడని టాస్ సందర్భంగా భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ వివరించాడు. గత మూడు టెస్టుల్లో ఆకట్టుకునే ప్రదర్శన చేయనప్పటికీ రజత్ పటిదార్ ధర్మశాల టెస్టులో కొనసాగుతాడని ప్రచారం జోరుగా సాగింది.
ఇటీవల జరిగిన ప్రెస్మీట్లో రజత్ పటిదార్ తుదిజట్టులో కొనసాగుతాడని రోహిత్ శర్మ పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడు. పరుగులు సాధించనప్పటికీ రజత్ పటిదార్కు ఎంతో టాలెంట్ ఉందని రోహిత్ పేర్కొన్నాడు. రజత్కు అవకాశం ఇవ్వాలని మాజీ క్రికెటర్లు కూడా యువక్రికెటర్కు మద్దతు ఇచ్చారు. దీంతో రజత్ జట్టులో కొనసాగుతాడని అందరూ నిర్ధారణకు వచ్చారు.

కానీ మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానున్న సమయంలో రజత్ పటిదార్ జట్టుకు దూరమయ్యాడని బీసీసీఐ ప్రకటించింది. రజత్ దూరమవ్వడానికి గాయం ఒక్కటే కారణం కాదని, అతను అనారోగ్యంతో ఉన్నాడని బీసీసీఐ తెలిపింది. ''మార్చి 6న టీమిండియా ప్రాక్టీస్ సెషన్లో రజత్ పటిదార్ ఎడమ చీలమండకు గాయమైంది. అంతేగాక ఇవాళ ఉదయం అతడు గొంతునొప్పితో బాధపడ్డాడు. అయిదో టెస్టుకు అతడు అందుబాటులో లేడు'' అని బీసీసీఐ ట్వీట్ చేసింది.
ఈ విషయంపై క్రికెట్ అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. రజత్ పటిదార్పై వేటు వేయడానికి ముందే నిర్ణయించారని, ఇప్పుడు గాయం, అనారోగ్యం కారణాలతో సాకులు చెబుతున్నారని కొందరు మండిపడుతున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండే ధర్మశాలలో రజత్ అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
కాగా, ఇంగ్లండ్ సిరీస్లో రజత్ పటిదార్ 63 పరుగులు చేశాడు. ఆడిన మూడు టెస్టుల్లో స్పిన్నర్ల చేతిలోనే ఔటయ్యాడు. వైజాగ్ టెస్టు (33, 9 పరుగులు) రెండు ఇన్నింగ్స్ల్లోనూ రెహాన్ అహ్మద్ బౌలింగ్ వెనుదిరిగాడు. అలాగే రాజ్కోట్ టెస్టులో (5, 0) టామ్ హర్ట్లీ బౌలింగ్లో, రాంచీ టెస్టులో (17, 0) షోయబ్ బషీర్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. రజత్ స్థానంలో దేవదత్ పడిక్కల్ జట్టులోకి వచ్చాడు.