IND vs ENG: లీడ్స్ టెస్టులో భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ జట్టుతో 5 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమికి ప్రధాన కారణం ఫీల్డింగ్ లోపాలే. ఒక్క యశస్వి జైస్వాల్ మాత్రమే ఈ మ్యాచ్లో 4 క్యాచ్లను జారవిడిచాడు.
యశస్వి జైస్వాల్ ఎందుకు క్యాచ్లు జారవిడుస్తున్నాడు?
మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ప్రకారం.. యశస్వి జైస్వాల్ తన చేతికి కట్టుకున్న స్ట్రాప్(పట్టి) వల్లనే ఈ సమస్య తలెత్తింది. ఈ స్ట్రాప్ వేసుకోవడం వల్ల వేళ్లు సరిగ్గా వంగలేదని, ఇది క్యాచ్లు పట్టడానికి ఆటంకంగా మారుతుందని కైఫ్ తన యూట్యూబ్ ఛానెల్లో వివరించాడు. స్ట్రాప్ వల్ల వేళ్లు ఒకే చోట బిగుసుకుపోయి కదలికలు కష్టం అవుతాయని.. అంతేకాకుండా స్ట్రాప్ వల్ల బంతిని పట్టుకోవడం మరింత కష్టమవుతుందని మహ్మద్ కైఫ్ పేర్కొన్నాడు. దీనివల్ల బంతికి, చేతికి మధ్య నేరుగా సంబంధం ఏర్పడదని కైఫ్ చెప్పాడు.

మహ్మద్ కైఫ్ మాట్లాడుతూ.. "యశస్వి జైస్వాల్ ఎందుకు క్యాచ్లు జారవిడుస్తున్నాడు? మనం డ్యూక్ బంతితో ప్రాక్టీస్ చేస్తున్నాం. మనకు గాయం అయినప్పుడు స్ట్రాప్ వేసుకుంటాం. అలాంటి పరిస్థితుల్లో వేళ్లు బిగుసుకుపోయి కదలలేవు. స్ట్రాప్ స్పాంజ్ లాగా మారడం వల్లే క్యాచ్ పట్టలేరు. ఈ క్రమంలో చేతుల్లోంచి నుంచి బంతి ఎగిరిపోతుంది. కాబట్టి ఇది నష్టదాయకం. బంతితో సహజమైన సంబంధాన్ని కోల్పోకూడదు." అని పేర్కొన్నారు.
జడేజా కూడా క్యాచ్ వదిలేశాడు..
యశస్వి జైస్వాల్ మాత్రమే కాదు.. ప్రపంచంలోని అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకరిగా పరిగణించబడే రవీంద్ర జడేజా కూడా ఒక సులువైన క్యాచ్ను వదిలేశాడు.రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా కూడా ఇంగ్లాండ్ బ్యాటర్లకు లైఫ్ ఇచ్చారు. దీనిని సద్వినియోగం చేసుకునన ఇంగ్లాండ్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు భారత్ కు ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మిగిలిన నాలుగు మ్యాచ్లలో రెండింటికి దూరంగా ఉండనున్నాడు. మొదటి మ్యాచ్లో బుమ్రా మంచి దూకుడుగా కనిపించాడు. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ కాస్త కష్టపడ్డారు. టీమ్ మేనేజ్మెంట్ దిగువ వరుస బ్యాటింగ్పై కూడా దృష్టి పెట్టాలి.