IND vs ENG: భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్తో లీడ్స్లో జరిగిన మొదటి టెస్ట్లో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో భారత జట్టు కెప్టెన్గా తొలిసారి వ్యవహరించిన శుభ్మన్ గిల్తో సహా నలుగురు భారత బ్యాటర్లు సెంచరీలు నమోదు చేశారు. ఒకే టెస్ట్లో భారత్ తరఫున ఐదు సెంచరీలు చేయడం చరిత్రలో ఇదే మొదటిసారి. అయితే ఐదు సెంచరీలు నమోదు చేసిన జట్టు ఓడిపోవడం కూడా ఇదే తొలిసారి. దీనిపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్, భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం జరిగింది.
మైఖేల్ వాన్, వసీం జాఫర్ మధ్య మాటల యుద్ధం
మైఖేల్ వాన్, వసీం జాఫర్ మధ్య సోషల్ మీడియాలో తరచూ ఇలాంటి సరదా చర్చలు జరుగుతుంటాయి. ఒకరినొకరు ఆటపట్టించే అవకాశాన్ని వీరు ఎప్పుడూ వదులుకోరు. ఇంగ్లండ్ భారత్ను తొలి టెస్ట్లో ఓడించిన తర్వాత మైఖేల్ వాన్ కూడా అదే చేశాడు. మైఖేల్ వాన్ ఎక్స్ వేదికగా వసీం జాఫర్ను ట్యాగ్ చేస్తూ.. "ఈవెనింగ్ వసీం జాఫర్.. మీరు బాగున్నారని ఆశిస్తున్నాను. 1-0" అని రాసుకొచ్చాడు. ఇంకేముంది.. వసీం జాఫర్ కూడా వెంటనే బదులిచ్చాడు.

వసీం జాఫర్ ధీటైన సమాధానం
మాజీ భారత క్రికెటర్ వసీం జాఫర్ తన హాస్యపూరిత పోస్టులతో తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. వసీం జాఫర్ మైఖేల్ వాన్ భారత బ్యాటింగ్ను చూసి ఆశ్చర్యపోయినప్పటి ఒక ఫోటోను షేర్ చేశాడు. ఆ ఫోటోతో పాటు " ఒక యువ భారత జట్టు మిమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టినందుకు సంతోషిస్తున్నాను. విజయాన్ని ఆస్వాదించు మైఖేల్.. మేము తిరిగి వస్తాం" అని రాసుకొచ్చాడు. అయినా మైఖేల్ వాన్ ఆగలేదు. దీనికి కూడా బదులిస్తూ "ఇప్పుడు 4-0 కూడా కావచ్చు వసీం" అని రాసుకొచ్చాడు. టీమిండియా తొలి టెస్టులో చివరిరోజు వరకు గట్టి పోటీ ఇచ్చింది. అయితే భారత్ ఓటమికి ప్రధాన కారణాలు చెత్త ఫీల్డింగ్, లోయర్ ఆర్డర్ బ్యాటర్ల వైఫల్యం, బౌలింగ్ లోపాలు, రిషబ్ పంత్ రెండు ఇన్నింగ్స్లలో సెంచరీలు కొట్టినా, వికెట్ కీపర్గా అతని నుంచి చాలా తప్పులు జరిగాయి.
చివరి రోజు ఇంగ్లాండ్ కు విజయం కోసం 350 పరుగులు అవసరం కాగా.. వారు 5 వికెట్ల తేడాతో విజయం సాధించారు. ఓపెనర్ బెన్ డకెట్ 149 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. రెండో టెస్ట్ జులె 2న జరగనుంది.