రాంచీ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్లో రోహిత్ సేన 177 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ స్పిన్నర్ల ధాటికి భారత బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పడుతున్నారు. అయితే పేలవమైన బ్యాటింగ్తో పాటు ప్రతికూల అంపైర్ నిర్ణయాలు టీమిండియా కొంపముంచాయి. ఒకటి కాదు, ఏకంగా అంపైర్ కాల్స్తో ముగ్గురు భారత బ్యాటర్లు ఔటయ్యారు.
కుదురుకున్న శుభ్మన్ గిల్ (38; 65 బంతుల్లో)తో పాటు రజత్ పటిదార్ (17; 72 బంతుల్లో), రవిచంద్రన్ అశ్విన్ (1; 13 బంతుల్లో) అంపైర్ కాల్తోనే పెవిలియన్కు చేరారు. షోయబ్ బషీర్ బౌలింగ్లో ఫార్వర్డ్ ఢిఫెండ్కు ప్రయత్నించిన గిల్ను అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు. మరో ఎండ్లో ఉన్న జైస్వాల్తో చర్చించి గిల్ రివ్వ్యూకి వెళ్లాడు. బంతి లెగ్ స్టంప్కు తగులుతుందని డీఆర్ఎస్లో చూపించింది. ఫీల్డ్ అంపైర్ నిర్ణయంతో ఏకీభవిస్తున్నామని థర్డ్ అంపైర్ ఔటిచ్చాడు.

రజత్ పటిదార్, అశ్విన్ విషయంలోనూ ఇదే జరిగింది. మన బ్యాటర్లు రివ్యూకి వెళ్లారు. సమీక్షను మాత్రం ఏం కోల్పోలేదు. కానీ మనోళ్లు ఔటయ్యారు. మరోవైపు ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో అంపైర్ కాల్స్ ప్రత్యర్థి జట్టుకు కలిసిరావడం గమనార్హం. గిల్, రజత్, అశ్విన్లలో ఒక్కరు నాటౌట్గా నిలిచినా కీలక భాగస్వామ్యాల నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించేవారు. కానీ టీమిండియాను రాంచీ టెస్టులో దురదృష్టం వెంటాడుతోంది.
కాగా, ప్రస్తుతం క్రీజులో వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ (12*; 25 బంతుల్లో), కుల్దీప్ యాదవ్ (4; 9 బంతుల్లో) ఉన్నారు.అంతకుముందు 302/7 ఓవర్నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ 353 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ (122; 274 బంతుల్లో) అజేయంగా నిలిచాడు. రాబిన్సన్ (58; 96 బంతుల్లో)తో కలిసి రూట్ ఎనిమిదో వికెట్కు శతక భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు, ఆకాశ్ దీప్ మూడు, సిరాజ్ రెండు, అశ్విన్ ఒక వికెట్ తీశారు.