
అడిలైడ్: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్లో భాగంగా భారత క్రికెట్ జట్టు ఇంకాసేపట్లో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడుతోంది. కొద్దిసేపటి కిందటే టాస్ పడింది. ఇంగ్లాండ్ జట్టు కేప్టెన్ జోస్ బట్లర్- టాస్ గెలుచుకున్నాడు. తొలుత ఫీల్డింగ్ చేయడానికే మొగ్గు చూపాడు. ఛేజింగ్ చేసే అవకాశాన్ని భారత్కు ఇవ్వలేదు. ఛేజింగ్లో టీమిండియా ఎంత దూకుడుగా ఆడుతుందో బాగా తెలిసిన అనుభవం ఉండటం వల్లేనేమో- టాస్ గెలిచిన జోస్.. తొలుత ఫీల్డింగ్నే ఎంచుకున్నాడు.
ఈ మ్యాచ్లో భారత్కు శుభారంభం దక్కలేదు. ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. రెండో ఓవర్ నాలుగో బంతికి కేెఎల్ రాహుల్ బలి అయ్యాడు. క్రిస్ వోక్స్ విసిరిన గుడ్ లెంగ్త్ బంతిని అర్థం చేసుకోవడంలో విఫలం అయ్యాడు. ఎలా ఆడాలో తెలియక తికమక పడ్డాడు. ఆ గ్యాప్లో బంతి అతని బ్యాట్ ఎడ్జ్ను ముద్దాడి నేరుగా వికెట్ కీపర్ జోస్ బట్లర్ చేతుల్లో వాలింది. అప్పటికి జట్టు స్కోర్ 9 పరుగులే. అనంతరం విరాట్ కోహ్లీ క్రీజ్లోకొచ్చాడు. తనదైన శైలిలో ఆడుతున్నాడు.
రోహిత్ శర్మ కూడా త్వరగానే పెవలియన్ దారి పట్టాడు. ఎక్కువసేపు క్రీజ్లో ఉండలేకపోయాడు. 28 బంతుల్లో నాలుగే ఫోర్లు కొట్టిన ఈ హిట్ మ్యాన్ 27 పరుగులు చేశాడు. క్రిస్ జోర్డాన్ బౌలింగ్లో వెనుదిరిగాడు. 9వ ఓవర్ అయిదో బంతికి భారీ షాట్ ఆడబోయాడు గానీ టైమింగ్ మిస్ అయ్యాడు. అది కాస్త లోయర్ బ్యాట్ను తాకిన బంతి లాంగాన్ దిశగా గాల్లోకి ఎగిరింది. అక్కడే పొంచివున్న సామ్ కుర్రన్ దీన్ని అద్భుతంగా అందుకున్నాడు. పక్షిలా గాల్లోకి ఎగిరి.. నేలకు తాకుందనుకున్న చివరి సెకెండ్లో బంతిని చేజిక్కించుకున్నాడు. అప్పటికి జట్టు స్కోరు 56 పరుగులు.
నయా సూపర్ స్టార్ సూర్యకుమార్ యాదవ్ కూడా నిరాశపరిచాడు. తక్కువ స్కోరుకే అవుట్ అయ్యాడు. 10 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్తో 14 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆదిల్ రషీద్ విసిరిన స్లో లెగ్ బ్రేక్ బంతికి బలి అయ్యాడు సూర్య. ఎక్స్ట్రా కవర్స్ దిశగా బంతిని స్వీప్ ఆడబోయి.. గాల్లోకి లేపాడు. డీప్ కవర్ పాయింట్లో ఉన్న ఫిల్ సాల్ట్ దాన్ని దొరకబుచ్చుకున్నాడు. దీనితో 75 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది టీమిండియా.