రాంచీ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా పోరాడుతోంది. రెండో రోజు ఆట ముగిసేసరికి తొలి ఇన్నింగ్స్లో 73 ఓవర్లలో భారత్ ఏడు వికెట్లకు 219 పరుగులు చేసింది. ప్రత్యర్థి కంటే 134 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజులో ధ్రువ్ జురెల్ (30*; 58 బంతుల్లో), కుల్దీప్ యాదవ్ (17*; 72 బంతుల్లో) ఉన్నారు. మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 353 పరుగులు చేసింది.
అయితే ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లండ్ టెస్టు సిరీస్లో టీమిండియా అరుదైన రికార్డు సృష్టించింది. టెస్టు క్రికెట్ చరిత్రలో ఓ సిరీస్లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా భారత్ సంచలన రికార్డు నెలకొల్పింది. ఇంగ్లండ్తో సాగుతున్న ఈ సిరీస్లో ఇప్పటివరకు టీమిండియా 50 సిక్సర్లు బాదింది. ఇప్పటివరకు ఏ జట్టూ ఓ టెస్టు సిరీస్లో 50 సిక్సర్ల మార్క్ను అందుకోలేదు. టెస్టు హిస్టరీలో ఇదే ఫస్ట్ టైమ్.

ఈ రికార్డులో యువ సంచలనం యశస్వీ జైస్వాల్ పాత్ర ఎంతో కీలకం. జైస్వాల్ ఒక్కడే ఏకంగా 23 సిక్స్లు బాదడం విశేషం. జైస్వాల్ తర్వాత రెండో స్థానంలో ఉన్న ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కేవలం ఆరు సిక్సర్లే సాధించాడు. యువ క్రికెటర్లు శుభ్మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ తలో నాలుగు సిక్సర్లు బాదారు.
అంతేగాక భారత్ వర్సెస్ ఇంగ్లండె సిరీస్ మరో అరుదైన ఘనతకు సాక్ష్యంగా నిలిచింది. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు నమోదైన సిరీస్గా చరిత్రకెక్కింది. ఈ సిరీస్లో ఇప్పటివరకు 75 రికార్డులు నమోదయ్యాయి. గతంలో ఈ రికార్డు 'ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా' యాషెస్ సిరీస్ పేరిట ఉండేది. 2023లో జరిగిన యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్, ఆసీస్ జట్లు కలిపి 74 సిక్సర్లు సాధించాయి. ఇప్పుడు ఆ రికార్డు బ్రేక్ అయ్యింది.
టెస్టు చరిత్రలో అత్యధిక సిక్సర్లు నమోదైన సిరీస్లు
75 సిక్సర్లు - భారత్ వర్సెస్ ఇంగ్లండ్ (2024)
74 సిక్సర్లు - ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా (2023)
65 సిక్సర్లు - ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్ (2013/14)
65 సిక్సర్లు - భారత్ వర్సెస్ సౌతాఫ్రికా (2019)
59 సిక్సర్లు - పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ (2014).