రాంచీ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 103.2 ఓవర్లకు 307 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ కంటే 46 పరుగుల లోటులో ఉంది. మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 353 పరుగులు చేసింది. అయితే 177 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నభారత్ను వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ (90; 149 బంతుల్లో) గొప్పగా పోరాడి ఆదుకున్నాడు. కానీ తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు.
219/7 ఓవర్నైట్ స్కోరుతో ఇవాళ ఆటను ప్రారంభించిన టీమిండియా సాధికారికంగానే ఆడింది. కుల్దీప్ యాదవ్ (28; 131 బంతుల్లో)తో కలిసి ధ్రువ్ జురెల్ ఎనిమిదో వికెట్కు 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సాలిడ్ ఢిఫెన్స్ ఆడుతున్న కుల్దీప్ దురదృష్టవశాత్తు ఔటయ్యాడు. అండర్సన్ బౌలింగ్లో ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకుని బౌల్డయ్యాడు.

మరోవైపు కుల్దీప్ ఔటైన అనంతరం ధ్రువ్ జురెల్ గేర్ మార్చాడు. కాస్త దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ భారత్ లోటు స్కోరును తగ్గించాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ సాధించాడు. అరంగేట్ర ప్లేయర్ ఆకాశ్ దీప్ (9; 29 బంతుల్లో)తో కలిసి తొమ్మిదో వికెట్కు 40 పరుగులు జోడించాడు. ఆకాశ్ దీప్ వెనుదిరిగిన తర్వాత కూడా బౌండరీలతో హోరెత్తించాడు. ఫోర్లు, సిక్సర్లతో సెంచరీకి చేరువయ్యాడు. కానీ హర్ట్లీ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమై బౌల్డయ్యాడు.
టీమిండియా బ్యాటర్లలో యశస్వీ జైస్వాల్ (73), రోహిత్ శర్మ (2), శుభ్మన్ గిల్ (38), రజత్ పటిదార్ (17), రవీంద్ర జడేజా (12), సర్ఫరాజ్ ఖాన్ (14), అశ్విన్ (1) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ అయిదు వికెట్లు, టామ్ హర్ట్లీ మూడు, అండర్సన్ రెండు వికెట్లు తీశారు.