రాంచీ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తుంది. గెలుపు దిశగా అడుగులు వేస్తుంది. విజయానికి మరో 152 పరుగుల దూరంలో నిలిచింది. ఆదివారం ఆట ముగిసేసరికి టీమిండియా 8 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. క్రీజులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (24; 27 బంతుల్లో), యశస్వీ జైస్వాల్ (16; 21 బంతుల్లో) ఉన్నారు.
అయితే శనివారం ఆటలో తొలి ఇన్నింగ్స్లో ఓ సందర్భంలో భారత్ స్కోరు 177/7 మాత్రమే. కానీ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ (90; 149 బంతుల్లో) అద్భుత పోరాటంతో టీమిండియా 307 పరుగులు చేసింది. కుల్దీప్ యాదవ్ (28; 131 బంతుల్లో)తో కలిసి అతడు ఎనిమిదో వికెట్కు 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత అరంగేట్ర ప్లేయర్ ఆకాశ్ దీప్ (9; 29 బంతుల్లో)తో కలిసి తొమ్మిదో వికెట్కు 40 పరుగులు జోడించాడు. దూకుడుగా ఆడే క్రమంలో సెంచరీని చేజార్చుకున్నాడు.

శతకాన్ని కోల్పోయినా ధ్రువ్ జురెల్ మాజీ క్రికెటర్ల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. కెరీర్లో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడని కొనియాడుతున్నారు. దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్.. ధ్రువ్ జురెల్ను ధోనీ 2.0తో పోల్చాడు. టీమిండియాకు మరో మహేంద్ర సింగ్ ధోనీ తయారవుతున్నాడని గవాస్కర్ పేర్కొన్నాడు. కామెంటరీ బాక్స్లో ఉన్న గవాస్కర్ 'మైదానంలో ధ్రువ్ జురెల్ ఆట విధానం చూస్తుంటే.. అతడు మరో ధోనీ అవతాడని నాకు అనిపిస్తుంది' అని గవాస్కర్ పేర్కొన్నాడు.
మరోవైపు మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ ధ్రువ్ జురెల్ సెల్యూట్ సెలబ్రేషన్స్ ఫొటో పోస్ట్ చేసి ట్వీట్ చేశాడు. ''ఇవాళ నువ్వు చేసిన ప్రదర్శన దేశమంతా సెల్యూట్ చేస్తోంది. వికెట్ కీపింగ్లోనూ, బ్యాటింగ్లోనూ అద్భుత ప్రదర్శన చేశావు. నువ్వు సాధించిన కీలక ఇన్నింగ్స్, కుల్దీప్తో నెలకొల్పిన భాగస్వామ్యం అద్వితీయం. గొప్ప ప్రదర్శన చేశావు'' అని జాఫర్ ట్వీట్ చేశాడు.
కాగా, ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 53.5 ఓవర్లలో 145 పరుగులకే కుప్పకూలింది. రవిచంద్రన్ అశ్విన్ (5/51), కుల్దీప్ యాదవ్ (4/22) మాయాజాలానికి ఇంగ్లిష్ జట్టు విలవిలలాడింది. జాక్ క్రాలే (60; 91 బంతుల్లో) టాప్ స్కోరర్. బెన్ డకెట్ (15; 15 బంతుల్లో), ఒలీ పోప్ (0; 1 బాల్), జానీ బెయిర్స్టో (30; 42 బంతుల్లో), టామ్ హర్ట్లీ (7; 25 బంతుల్లో), రాబిన్సన్ (0, 3 బంతుల్లో), బెన్ ఫోక్స్ (17;76 బంతుల్లో), జో రూట్ (11), బెన్ స్టోక్స్ (4) పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 353 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.