ఆఖరి పంచ్ అదిరింది. ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరిగిన ఆఖరి టెస్టులో ఆల్రౌండ్ షోతో భారత్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను చిత్తుగా ఓడించింది. అయిదు టెస్టుల సిరీస్ను 4-1తో టీమిండియా గ్రాండ్గా ముగించింది. తొలి టెస్టులో ఓటమి అనంతరం టీమిండియా వరుస విజయాలతో హోరెత్తించింది.
ఓవర్నైట్ స్కోరు 473/8తో శనివారం ఆట ప్రారంభించిన భారత్ ఇవాళ మరో నాలుగు పరుగులు మాత్రమే చేసి 477 పరుగులకు ఆలౌటైంది. కుల్దీప్ (30; 69 బంతుల్లో), జస్ప్రీత్ బుమ్రా (20; 64 బంతుల్లో) 49 పరుగుల భాగస్వామ్యానికి జేమ్స్ అండర్సన్ తెరదించాడు. కుల్దీప్ను ఔట్చేసి టెస్టుల్లో తన ఖాతాలో 700 వికెట్ల మార్క్ను అందుకున్నాడు. తర్వాతి ఓవర్లోనే షోయబ్ బషీర్ బౌలింగ్లో బుమ్రా స్టంపౌటయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో భారత్కు 259 పరుగుల ఆధిక్యం లభించింది.

అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 48.1 ఓవర్లలోనే 195 పరుగులకు కుప్పకూలింది. 100వ టెస్టు ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ అయిదు వికెట్లతో ఇంగ్లిష్ జట్టు పతనాన్ని శాసించాడు. వికెట్ల పార్టీలో బుమ్రా, కుల్దీప్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ఇంగ్లండ్ జట్టులో జో రూట్ (84; 128 బంతుల్లో) ఒక్కడే పోరాడాడు.
వెన్నునొప్పి కారణంగా ఇవాళ ఆటలో టీమిండియా కెప్టెన్ రోహిత్ బరిలోకి దిగలేదు. దీంతో వైస్కెప్టెన్ బుమ్రా సారథి బాధ్యతలు అందుకున్నాడు. కొత్తబంతి అశ్విన్కు అందించి మంచి ఫలితాన్ని రాబట్టాడు. తన తొలి ఓవర్ నుంచే అశ్విన్ వికెట్ల వేట మొదలుపెట్టడంతో ఇంగ్లండ్ 36 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన జానీ బెయిర్స్టో (39; 31 బంతుల్లో) కలిసి జో రూట్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ కుల్దీప్ రాకతో ఇంగ్లండ్ 103/5తో లంచ్ విరామానికి వెళ్లింది.
రెండో సెషన్ ఆదిలోనే బెన్ ఫోక్స్ (8; 17 బంతుల్లో)ను అశ్విన్ బౌల్డ్ చేశాడు. కాసేపటికే ఒకే ఓవర్లో టామ్ హర్ట్లీ (20; 24 బంతుల్లో), మార్క్ వుడ్ (0; 2 బంతుల్లో)ను బుమ్రా ఔట్ చేసి మ్యాచ్ను తొందరగా ముగించేలా ప్రయత్నించాడు. కానీ షోయబ్ బషీర్ (18; 29 బంతుల్లో) కలిసి జో రూట్ తన పోరాటాన్ని కొనసాగించాడు. కుల్దీప్ రీఎంట్రీతో ఇంగ్లండ్ ఓటమి లాంఛనమైంది.
స్కోరు వివరాలు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 218
భారత్ తొలి ఇన్నింగ్స్: 477
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 195