అయిదు టెస్టుల సిరీస్లో భారత్-ఇంగ్లండ్ చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా నిలిచాయి. ఇరు జట్లు నువ్వానేనా అన్నట్లుగా పోటీపడుతుండటంతో చివరి మూడు టెస్టులపై ఆసక్తి మరింత పెరిగింది. ఫిబ్రవరి 15 నుంచి రాజ్కోట్ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది. అయితే భారత జట్టును బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. సిరీస్ ఆరంభానికి ముందు తొలి రెండు టెస్టులకు మాత్రమే జట్టును ప్రకటించారు.
మరోవైపు కీలక ఆటగాళ్ల నుంచి కబురు కోసం సెలక్టర్లు ఎదురుచూస్తున్నారు. వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టులకు దూరమైన విరాట్ కోహ్లి టెస్టు సిరీస్ మొత్తానికి దూరమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కోహ్లి గైర్హాజరీకి స్పష్టమైన కారణం తెలియనప్పటికీ తన భార్య అనుష్క శర్మ రెండో బిడ్డకు జన్మనివ్వడంతో దూరమయ్యాడనే కథనాలు వస్తున్నాయి.

అయితే తొలి టెస్టులో గాయపడి వైజాగ్ టెస్టుకు దూరమైన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారిద్దరు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో వేగంగా కోలుకుంటున్నారు. దీంతో ఈ సీనియర్లు జట్టులో రీఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖరారే. అలాగే రెండో టెస్టుకు విశ్రాంతి తీసుకున్న హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ కూడా తిరిగి జట్టులో చేరనున్నాడు.
మరోవైపు బుమ్రా మూడు, నాలుగు టెస్టులకు దూరమవుతాడని గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తల్లో నిజంలేదని తెలుస్తోంది. సీనియర్లు అందుబాటులో ఉండటంపై స్పష్టత లేకపోవడంతో బుమ్రాను కొనసాగించే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం. అంతేగాక ఇతర పేసర్లు ప్రభావం చూపకపోవడమూ మరో కారణం. కాగా, ఈ వారంలో ఇంగ్లండ్తో చివరి మూడు టెస్టులకు టీమిండియాను సెలక్టర్లు ప్రకటించే అవకాశం ఉంది.

గత కొన్నాళ్లుగా బ్యాటింగ్లో విఫలమవుతున్న శ్రేయస్ అయ్యర్కు మరో అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం.విరాట్ కోహ్లి గైర్హాజరీలో సర్ఫరాజ్, రజత్ పటిదార్ ఇద్దరూ జట్టులో ఉండే అవకాశం ఉంది. కోహ్లి స్థానంలో తొలి రెండు టెస్టులకు రజత్ పటిదార్ జట్టులో వచ్చిన విషయం తెలిసిందే. రెండో టెస్టు తుదిజట్టులో ఉన్నప్పటికీ సత్తాచాటలేకపోయాడు. మరోవైపు వైజాగ్ టెస్టు కోసం కేఎల్ రాహుల్ స్థానంలో సర్ఫరాజ్ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.