టీమిండియాకు గుడ్న్యూస్. అత్యవసర వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరమైన సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తిరిగొస్తున్నాడని బీసీసీఐ తెలిపింది. ఆదివారం ఆటకు అందుబాటులో ఉండనున్నానడని ప్రకటించింది. రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో రెండు రోజు ఆట ముగిసిన అనంతరం అశ్విన్ చెన్నైకి వెళ్లిన విషయం తెలిసిందే.
తన తల్లికి అత్యవసర ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా అశ్విన్ను జట్టును వీడాడు. ''కుటుంబ అత్యవసర పరిస్థితి కారణంగా అశ్విన్ జట్టు నుంచి తాత్కాలికంగా వైదొలిగాడు. అయితే అతడు తిరిగొస్తున్నాడు. నాలుగో రోజు ఆటలో భాగమవుతాడు'' అని బీసీసీఐ ప్రకటించింది. అయితే బీసీసీఐ ప్రకటన ముందే స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్పందిస్తూ.. అశ్విన్ తిరిగొచ్చే అవకాశం ఉందని చెప్పాడు. ''కచ్చితంగా తెలియదు. కానీ యాష్ భాయ్ తిరిగి వస్తాడని భావిస్తున్నా'' అని కుల్దీప్ చెప్పాడు. అశ్విన్ దూరమవ్వడంతో తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ను కట్టడిచేయడానికి టీమిండియా నలుగురు బౌలర్లతోనే బరిలోకి దిగిన విషయం తెలిసిందే.

అయినా గొప్ప పోరాట పటిమ చూపిస్తూ తొలి ఇన్నింగ్స్లో 126 పరుగుల ఆధిక్యాన్ని అందించారు. సిరాజ్ నాలుగు వికెట్లు, కుల్దీప్, జడేజా చెరో రెండు వికెట్లు, బుమ్రా తలో వికెట్ తీశారు. రెండో రోజు ఆటలో అశ్విన్ ఒక్క వికెట్ పడగొట్టిన విషయం తెలిసిందే. అయితే శనివారం ఆటలో అశ్విన్ స్థానంలో దేవ్దత్ పడికల్ సబ్స్టిట్యూట్ ఫీల్డర్గా వచ్చాడు. కానీ సబ్స్టిట్యూట్కు బౌలింగ్, బ్యాటింగ్ చేసే అవకాశం లేదు. కంకషన్ సబ్స్టిట్యూట్కు మాత్రమే ఆ అవకాశం ఉంటుంది.
కాగా, ఓవర్నైట్ స్కోరు 196/2తో ఇవాళ ఆటను ఆరంభించిన టీమిండియా వికెట్ పడకుండా బ్యాటింగ్ కొనసాగిస్తుంది. శుభ్మన్ గిల్ (84*) సెంచరీ దిశగా సాగుతున్నాడు. అతడికి తోడుగా కుల్దీప్ యాదవ్ (18*) క్రీజులో ఉన్నాడు. ఇంగ్లండ్ కంటే భారత్ 356 పరుగుల ఆధిక్యంలో ఉంది. యశస్వి జైస్వాల్ (104 రిటైర్డ్హర్ట్; 133 బంతుల్లో 9×4, 5×6) సూపర్ సెంచరీతో సత్తాచాటిన విషయం తెలిసిందే. జైస్వాల్ ఇవాళ బ్యాటింగ్కు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: 445
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 319