IND vs ENG: ఇండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో అత్యంత కీలకమైన చివరి టెస్టుకు కేవలం రెండు రోజుల ముందు లండన్లోని ఓవల్ మైదానంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మైదానం సిబ్బందితో తీవ్ర వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఈ సంఘటన సిరీస్ చివరి మ్యాచ్కు ముందు వాతావరణాన్ని మరింత వేడెక్కించింది.
శిక్షణ సౌకర్యాలపై గంభీర్ అసంతృప్తి..మైదానం సిబ్బందితో ఘర్షణ
మాంచెస్టర్లో సుదీర్ఘమైన నాలుగో టెస్ట్ మ్యాచ్ తర్వాత సోమవారం లండన్కు చేరుకున్న భారత జట్టు మంగళవారం ఓవల్లో తమ మొదటి ప్రాక్టీస్ సెషన్ను షెడ్యూల్ చేసింది. అయితే ప్రాక్టీస్ కోసం కేటాయించిన సౌకర్యాలు తమ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో గంభీర్ తీవ్ర నిరాశకు గురైనట్లు సమాచారం. ఈ అసంతృప్తి క్రమంగా ఘర్షణకు దారితీసింది.

గంభీర్ మైదానం సిబ్బందిపై గట్టిగా అరిచినట్లు తెలిసింది. ఈ వాగ్వాదం ఘర్షణకు దారి తీసినప్పటికీ.. అది చేతల వరకు వెళ్లలేదు. బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్తో పాటు భారత సహాయక బృందంలోని ఇతర సభ్యులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించారు. ఇదిలా ఉండగా.. ఓవల్ మైదానం సిబ్బంది గంభీర్పై అధికారిక ఫిర్యాదు చేస్తామని బెదిరించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి గంభీర్ వెనక్కి తగ్గకుండా.. "మీరు ఎవరికి కావాలంటే వారికి ఫిర్యాదు చేయండి.. కానీ మీరు మాకు ఏం చెప్పగలరు?" అని సమాధానం ఇచ్చాడట.
చివరి టెస్ట్ మ్యాచ్ ముందు మరింత ఉత్కంఠ
ఈ వివాదం గురువారం జరగనున్న సిరీస్ చివరి మ్యాచ్కు ముందు వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. ఓల్డ్ ట్రాఫోర్డ్లో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ చారిత్రాత్మకంగా డ్రాగా ముగిసిన తర్వాత 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఇంగ్లండ్ ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు అందరి దృష్టి లండన్లోని ఓవల్ మ్యాచ్పై ఉంది. ఇక్కడ మైదానం వెలుపల నెలకొన్న ఈ ఉద్రిక్తతలు అత్యంత కీలకమైన చివరి మ్యాచ్ను మరింత ఉత్కంఠగా మార్చాయి. సిరీస్ను సమం చేయాలనే లక్ష్యంతో భారత జట్టు ఎలా రాణిస్తుందో వేచి చూడాలి.