IND vs ENG: ప్రస్తుతం ఓవల్లో టెస్ట్ కోసం భారత జట్టు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తోంది. ఈ ప్రాక్టీస్ సెషన్ మధ్యలో ఒక వీడియో వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టించింది. ఆ వీడియోలో గౌతమ్ గంభీర్ మైదానం సిబ్బంది పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కనిపించారు. ముఖ్యంగా పిచ్ క్యూరేటర్ లీ ఫొర్టిస్తో ఆయనకు పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనతో లీ ఫొర్టిస్ గంభీర్పై అధికారికంగా ఫిర్యాదు చేస్తానని బెదిరించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ వాగ్వాదం తీవ్రమవుతున్న సమయంలో భారత బ్యాటింగ్ కోట్ సితాన్షు కోటక్ జోక్యం చేసుకుని పరిస్థితిని సద్దుమణిగేలా చేయడానికి ప్రయత్నించారు. అయితే గౌతమ్ గంభీర్ వెనక్కి తగ్గకుండా ఫోర్టిస్కు వేలితో చూపిస్తూ.. "ఎవరికి కావాలంటే వారికి వెళ్లి ఫిర్యాదు చేసుకోపో.. " అంటూ బహిరంగంగా సవాల్ విసిరినట్లు సమాచారం. ఇది గౌతమ్ గంభీర్ కోపాన్ని, ఆత్మ విశ్వాసాన్ని స్పష్టం చేస్తోంది.

ఎవరీ లీ ఫొర్టిస్?
లీ ఫొర్టిస్ 2012 నుంచి ది కియా ఓవల్ మైదానంలో హెడ్ గ్రౌండ్స్మెన్ గా పనిచేస్తున్నాడు. అంతర్జాతీయ, దేశీయ మ్యాచ్లకు పిచ్లను సిద్ధం చేయడంలో అతను కీలక పాత్ర పోషిస్తాడు. లీ ఫొర్టిస్ తన పిచ్ల నాణ్యతకుగానూ ఇప్పటికే పలు ప్రశంసలు, అవార్డులు అందుకున్నారు. ముఖ్యంగా 2012, 2022, 2023, 2024 సంవత్సరాల్లో మల్టీ-డే పిచ్లను సిద్ధం చేసినందుకు లీ ఫొర్టిస్కు బెర్నార్డ్ ఫ్లాక్ మెమోరియల్ ట్రోఫీ లభించింది. ఇది ఇంగ్లండ్ వంటి సవాలుతో కూడా వాతావరణంలో కూడా లీ ఫొర్టిస్ అత్యుత్తమ నాణ్యత గల పిచ్లను తయారు చేయగల సామర్థ్యాన్ని స్పష్టం చేస్తుంది. లీ ఫొర్టిస్కు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ECB), సర్రే కౌంటీ క్రికెట్ క్లబ్ నుంచి మంచి గౌరవం ఉంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య ఓవల్లో జరిగిన గత డబ్ల్యూటీసీ ఫైనల్ పిచ్ను కూడా అతనే సిద్ధం చేశారు.
ఇది లీ ఫొర్టిస్కు మొదటిసారేం కాదు.. భారత మహిళా జట్టుతోనూ గతంలో వివాదం
దైనిక్ జాగరణ్ నివేదిక ప్రకారం.. లీ ఫొర్టిస్కు ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా భారత మహిళా జట్టుతో ఒక మ్యాచ్ సందర్భంగా పిచ్పై వాగ్వాదం జరిగిందట. సందర్శక జట్ల పట్ల లీ ఫొర్టిస్ ప్రవర్తన అంత సక్రమంగా ఉండదని, గౌతమ్ గంభీర్తో జరిగిన తాజా ఘర్షణ ఈ విషయాన్ని మరోసారి రుజువు చేస్తుందని నివేదికలు పేర్కొంటున్నాయి. భారత జట్టుతో లీ ఫొర్టిస్కు ఇది రెండో సంఘటన కావడం గమనార్హం.