భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్లో అరుదైన రికార్డు నమోదైంది. క్రికెట్ చరిత్రలో 100 సిక్సర్ల నమోదైన ఏకైక టెస్టు సిరీస్గా నిలిచింది. స్వదేశంలో ఇంగ్లండ్తో భారత్ అయిదు టెస్టుల సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్టులో ఇరుజట్లు ఉమ్మడిగా 100 సిక్సర్ల మార్క్ను అందుకున్నాయి.
ఈ సిరీస్లో ఇప్పటివరకు 101 సిక్సర్లు నమోదయ్యాయి. దీనిలో టీమిండియా 73, ఇంగ్లండ్ 29 సిక్సర్లు సాధించాయి. యశస్వీ జైస్వాల్ ఒక్కడే 26 సిక్సర్లు బాదడం విశేషం. కాగా, అంతకుముందు అత్యధిక సిక్సర్లు నమోదైన సిరీస్గా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ యాషెస్ టెస్టు సిరీస్ ఉండేది. 2023 యాషెస్లో 74 సిక్సర్లు బాదారు.

కాగా, ఈ సిరీస్లో మరో అరుదైన ఘనత నమోదైంది. ఓ టెస్టు సిరీస్లో 25 వికెట్లు తీసిన తొలి బౌలర్గా రవిచంద్రన్ అశ్విన్ రికార్డు సృష్టించాడు. టెస్టు చరిత్రలో అశ్విన్ మినహా ఇప్పటివరకు ఏ బౌలర్ ఈ ఘనత అందుకోలేదు. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ను ఔట్ చేసి యాష్ ఈ రికార్డు నెలకొల్పాడు. తన 100వ టెస్టులో స్పెషల్ రికార్డు నమోదు చేయడం విశేషం.
అంతేగాక టెస్టుల్లో బెన్ స్టోక్స్ను ఔట్ చేయడం అశ్విన్కు ఇది 13వ సారి. అశ్విన్ వేసిన 648 బంతుల్లో 19 సగటుతో 253 పరుగులు చేసి 13 సార్లు స్టోక్స్ ఔటయ్యాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. శనివారం లంచ్ విరామానికి రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ అయిదు వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. అశ్విన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తీశాడు. ప్రస్తుతం క్రీజులో జో రూట్ (34), బెన్ ఫోక్స్ ఉన్నారు. ఇంగ్లండ్ ఇంకా 156 పరుగుల వెనుకంజలో ఉంది.
అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 477 పరుగులకు ఆలౌటైంది. ఓవర్నైట్ స్కోరు 473/8తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ ఇవాళ మరో నాలుగు పరుగులు మాత్రమే సాధించింది. 259 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 218 పరుగులకు ఆలౌటైంది.