ఇంగ్లాండ్ జట్టుతో ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా రెండో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇందులోనూ గెలిచి సిరీస్ ఆధిక్యంలోకి వెళ్లాలని భారత జట్టు పట్టుదలతో ఉంది. అయితే, రెండో టీ20 మ్యాచ్ ముందు భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
తొలి మ్యాచ్లో దూకుడుగా ఆడిన అభిషేక్ శర్మ ప్రస్తుతం గాయపడినట్లు తెలుస్తోంది. మొదటి మ్యాచ్ లో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన అతడు ప్రాక్టీస్ సెషన్ సమయంలో చీలమండ గాయంతో బాధపడినట్లు సమాచారం. అయితే, దీనిపై ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ అభిషేక్ శర్మ రెండో మ్యాచ్కు దూరమైతే.. ఓపెనర్గా ఎవరు వస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారనుంది. అయితే సంజూ శాంసన్, అభిషేక్కు బ్యాకప్ ఓపెనర్ ఎవరూ లేకపోవడం గమనార్హం.

ఎవరికి ఛాన్స్
రెండో మ్యాచ్ లో వాషింగ్టన్ సుందర్ లేదా ధ్రువ్ జురెల్ను తీసుకునే అవకాశముంది. అభిషేక్ శర్మ దూరమైతే అతడి స్థానంలో ఓపెనర్ గా తిలక్ వర్మ క్రీజులోకి వచ్చే ఛాన్స్ ఉంది. లేదంటే సూర్యకుమార్ ఓపెనర్గా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
షమీ ఖాయమేనా
రెండో టీ20లో షమీ ఆడటం ఖాయమేనని వార్తలు కూడా వస్తున్నాయి. తొలి మ్యాచ్ బరిలోకి దిగిన నితీశ్ రెడ్డి బ్యాటింగ్, బౌలింగ్ చేయలేదు. కాబట్టి అతడి స్థానంలో షమీని ఆడిస్తారని తెలుస్తోంది.
పిచ్ రిపోర్ట్
చెన్నై పిచ్ సాధారణంగానే స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఇప్పుడు జరగబోయే మ్యాచ్ లో పిచ్ బ్యాటర్లతో పాటు స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. పిచ్ పై తేమ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టాస్ నెగ్గిన జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు.