రాంచీ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయిదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను చిత్తుచేసింది. మరో మ్యాచ్ మిగిలుండగానే అయిదు టెస్టుల సిరీస్ను 3-1తో కైవసం చేసుకుంది. విజయంలో కీలక పాత్ర పోషించిన వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
మరోవైపు బజ్బాల్ అప్రోచ్ మొదలుపెట్టిన తర్వాత ఇంగ్లండ్కు ఇదే తొలి సిరీస్ ఓటమి. అంతేగాక వరుసగా మూడు టెస్టుల్లో ఓటమిపాలవ్వడం ఇదే మొదటిసారి. కెప్టెన్ బెన్ స్టోక్స్, కోచ్ మెక్కల్లమ్ సారథ్యంలో ఇంగ్లండ్ దూకుడైన ఆటతీరుతో టెస్టు క్రికెట్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చింది. దీనికే బజ్బాల్ అని పేరు పెట్టారు.

అయితే భారత్లో బజ్బాల్ పనిచేయదని సిరీస్ మొదలుకాకముందే టీమిండియా మాజీలు ఇంగ్లండ్కు సూచించారు. స్పిన్ పిచ్లపై దూకుడైన ఆటతీరుతో సత్తాచాటలేరని, అది మాకే ప్రయోజనమని టీమిండియా ప్లేయర్లు కూడా వివరించారు. అయినా బజ్బాల్తోనే ఇంగ్లండ్ సిరీస్ ప్రారంభించింది. ఫలితంగా మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ చేజార్చుకుంది.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇంగ్లండ్ను విమర్శిస్తూ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. ''బజ్బాల్ను కొనసాగిస్తూ మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. ఇక బోరింగ్గా ఫీల్ అయ్యే విజయాలను భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి జట్లకు ఇచ్చేయండి'' అని వీరూ తన శైలిలో పంచ్ డైలాగ్ విసిరాడు. ఈ ట్వీట్కు వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల టేబుల్ ఫొటోను జత చేశాడు.టేబుల్లో టాప్-3లో న్యూజిలాండ్, భారత్, ఆస్ట్రేలియా ఉన్నాయి. ఇక అట్టడుగు నుంచి రెండో స్థానంలో ఇంగ్లండ్ ఉంది.
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (2023-25) టేబుల్లో న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉంది. నాలుగు మ్యాచ్ల్లో మూడు విజయాలు సాధించి 75%తో 36 పాయింట్లు సాధించింది. రెండో స్థానంలో ఉన్న టీమిండియా ఎనిమిది మ్యాచ్ల్లో అయిదింట్లో గెలిచి 64.58%తో 62 పాయింట్ల అందుకుంది. ఇక ఎనిమిదో స్థానంలో ఉన్న ఇంగ్లండ్.. తొమ్మిది మ్యాచ్ల్లో మూడు నెగ్గింది. అయిదింట్లో ఓడి, ఒక్క మ్యాచ్ను డ్రా చేసుకుంది. 19.44%తో 21 పాయింట్లే సాధించింది.