మరో మ్యాచ్ మిగిలుండగానే అయిదు టెస్టుల సిరీస్ను 1-3తో ఇంగ్లండ్ కోల్పోవడంపై ఆ జట్టు మాజీ క్రికెటర్ జాఫ్రీ బాయ్కాట్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. నిర్భయంగా ఆడాలనే ఉద్దేశంతో చెత్త షాట్లతో వికెట్లు చేజార్చుకున్నారని మండిపడ్డాడు. రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో 192 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ కాపాడుకోవచ్చని 83 ఏళ్ల దిగ్గజ క్రికెటర్ బాయ్కాట్ అభిప్రాయపడ్డాడు. ఓటమికి గల కారణాలను విశ్లేషించాడు.
''భయం లేకుండా ఆడాలనుకోవడం మంచి ఉద్దేశమే. కానీ నిర్లక్ష్యమైన షాట్లు ఆడారు. ఔటవ్వడం ఆటలో భాగమే. కానీ, సిల్లీగా వికెట్ను చేజార్చుకోవడం సమంజసం కాదు.స్టోక్స్ కెప్టెన్సీని నేను ఇష్టపడతాను. కానీ నాలుగో ఇన్నింగ్స్ను ఇద్దరు స్పిన్నర్లతో ప్రారంభించి అతడు పెద్ద తప్పు చేశాడు. టీమిండియా ఛేదన ఆరంభంలో స్పిన్నర్లు జో రూట్, టామ్ హర్ట్లీతో బౌలింగ్ చేయించాడు. కఠినమైన కొత్త బంతి మరింత బౌన్స్, స్పిన్ అవుతుందని స్టోక్స్ భావించాడు''

''కానీ కొత్త బంతితో స్పిన్ బౌలింగ్ చేయాలంటే అనుభవం ఉండాలి. లేకపోతే బంతి వేళ్ల నుండి జారిపోతుంటుంది. దీంతో అనుకున్న లెంగ్త్లో బౌలింగ్ చేయలేరు. నేను ఆడిన సమయంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మురికిలో బంతిని రుద్దే వాళ్లం. దాంతో బంతిని మెరుగ్గా పట్టుకునేవాళ్లం. ఇప్పుడు అలా చేయడాన్ని నిషేధించారు. అందుకే ఇప్పుడు కంట్రోల్ చేయడం కష్టం''
''ఇక టెస్టుల్లో స్వల్ప స్కోర్లు అయినా ఛేదించడం అంత సులువు కాదని చరిత్ర మనకు చెబుతోంది. ఎందుకంటే ఆఖర్లో పిచ్ కఠినంగా ఉంటుంది. ఛేదన ప్రారంభంలోనే వికెట్లు దక్కితే అది మనకు అమూల్యమైన బోనస్. బ్యాటింగ్ జట్టుపై ఒత్తిడి తెస్తూ పరుగులు చేయకుండా కట్టడి చేయడం ఎంతో అవసరం'' అని బాయ్కాట్ పేర్కొన్నాడు.

192 పరుగుల ఛేదనను టీమిండియా మూడో రోజు ఆఖరి సెషన్ చివర్లో ప్రారంభించింది. అయితే స్టోక్స్ అండర్సన్కు బంతిని అందివ్వకుండా స్పిన్నర్లతో బౌలింగ్ చేయించాడు. టామ్ హర్ట్లీ బంతిని నియత్రించలేక ఫుల్టాస్లు వేశాడు. వాటిని మన బ్యాటర్లు యశస్వీ జైస్వాల్, రోహిత్ శర్మ బౌండరీలుగా మలిచారు. కాగా, మార్చి 7 నుంచి ధర్మశాల వేదికగా ఆఖరి టెస్టు ప్రారంభం కానుంది.