ధర్మశాల వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్టులో టీమిండియా స్పినర్ కుల్దీప్ యాదవ్ తన మాయాజలాన్ని ప్రదర్శిస్తున్నాడు. గింగరాలు తిప్పే బంతులతో పాటు గూగ్లీ, జఫ్పాలతో ఇంగ్లండ్ను ఇబ్బంది పెడుతున్నాడు. కుదురుకున్న ఇంగ్లిష్ ఆటగాళ్లను తన స్పిన్తో పెవిలియన్కు చేర్చుతున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 41 ఓవర్లకు 152 పరుగులు చేసి ఇంగ్లండ్ మూడు వికెట్లు కోల్పోయింది. అన్ని వికెట్లు కుల్దీప్ ఖాతాలోనే పడ్డాయి.
తన తొలి ఓవర్లోనే బెన్ డకెట్ (27; 58 బంతుల్లో) ను ఔట్ చేసి ఇంగ్లండ్ను కుల్దీప్ దెబ్బకొట్టాడు. అప్పటివరకు డిఫెండ్స్ ఆడిన డకెట్.. కుల్దీప్కు బౌండరీలతో స్వాగతం చెప్పాలనుకున్నాడు. దూకుడుగా ఆడాలనే తొందరలో బంతిని అంచనా వేయడంలో విఫలమై షాట్కు యత్నించాడు. శుభ్మన్ గిల్ సెన్సేషనల్ క్యాచ్కు వెనుదిరిగాడు. ఆ తర్వాత కుల్దీప్ అద్భుతమైన బంతులతో ఒలీ పోప్ (11; 24 బంతుల్లో), జాక్ క్రాలే (79; 108 బంతుల్లో)ను ఔట్ చేశాడు.

గూగ్లీతో పోప్ను కుల్దీప్ బోల్తాకొట్టించాడు. ముందకు వచ్చి ఢిఫెన్స్ చేయడానికి ప్రయత్నించిన పోప్కు అసలు బాల్యే దొరకలేదు. అనంతరం వికెట్ల వెనుక ఉన్న ధ్రువ్ జురెల్ బంతిని అందుకొని వికెట్లను గిరాటేశాడు. ఊహించని ఆ బంతితో ఔటైన అనంతరం పోప్ నిరాశగా మైదానాన్ని వీడాడు.
ఆ తర్వాత కుదురుకున్న జాక్ క్రాలేను కుల్దీప్ స్టన్నింగ్ డెలివరీతో క్లీన్బౌల్డ్ చేశాడు. సెంచరీ దిశగా సాగుతున్న క్రాలేను కుల్దీప్ ట్రాప్ చేశాడు. కవర్ డ్రైవ్ ఆడేలా బౌలింగ్ చేసి స్పిన్తో బోల్తాకొట్టించాడు. బాల్ 10.9 డిగ్రీలు టర్న్ అవ్వడం విశేషం. బ్యాటింగ్కు అంతగా సవాలు లేని ధర్మశాల పిచ్పై కుల్దీప్ మూడు వికెట్లు తీశాడు. ప్రస్తుతం క్రీజులో జో రూట్ (20*; 46 బంతుల్లో), జానీ బెయిర్స్టో (12*; 10 బంతుల్లో) ఉన్నారు.
కాగా, ఇప్పటికే సిరీస్ను 3-1తో కైవసం చేసుకున్న భారత్ ఆఖరి టెస్టు తుదిజట్టులో రెండు మార్పులు చేసింది. రజత్ పటిదార్, ఆకాశ్ దీప్ను తప్పించింది. గాయం కారణంగా రజత్ చివరి టెస్టుకు అందుబాటులో లేడని తెలిపింది. అతని స్థానంలో దేవదత్ పడిక్కల్ జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్తో దేవదత్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. మరోవైపు నాలుగో టెస్టుకు దూరమైన బుమ్రా తిరిగొచ్చాడు.