ధర్మశాల వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 57.4 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. కుల్దీప్ యాదవ్ (5/72), రవిచంద్రన్ అశ్విన్ (4/51) ధాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు వణికిపోయారు. పెవిలియన్కు క్యూ కట్టడానికి పోటీపడ్డారు. జాక్ క్రాలే (79; 108 బంతుల్లో) మినహా మిగిలిన ఇంగ్లిష్ బ్యాటర్లందరూ తేలిపోయారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్కు శుభారంభమే దక్కింది. తొలి వికెట్కు బెన్ డకెట్ (27; 58 బంతుల్లో)తో కలిసి జాక్ క్రాలే 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. క్రాలే కాస్త దూకుడుగా ఆడితే, డకెట్ సంయమనంతో పరుగులు చేశాడు. వీరిద్దరు కుదురుకోవడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. కానీ గిల్ స్టన్నింగ్ క్యాచ్తో డకెట్ వికెట్ కోల్పోయాడు.

ఆ తర్వాత వచ్చిన పోప్ (11; 24 బంతుల్లో)తో కలిసి క్రాలే ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. ఓ దశలో 100/1తో ఇంగ్లండ్ మెరుగైన స్థితిలోనే నిలిచింది. కానీ కుల్దీప్ మాయతో ఇంగ్లండ్ టపాటపా వికెట్లను చేజార్చుకుంది. 100/2తో రెండో సెషన్ను ఆరంభించిన ఇంగ్లండ్ను కుల్దీప్, అశ్విన్ కోలుకోలేని దెబ్బతీశారు. రెండో సెషన్లో ఇంగ్లండ్ ఆరు వికెట్లు కోల్పోవడం గమనార్హం. మూడో సెషన్ ప్రారంభమైన కొద్దిసేపటికీ ఇంగ్లండ్ ఆలౌటైంది.
తన కెరీర్లో 100వ టెస్టు ఆడుతున్న అశ్విన్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు చొప్పున నాలుగు వికెట్లు పడగొట్టడం విశేషం. మరోవైపు కుల్దీప్ యాదవ్ టెస్టుల్లో 50 వికెట్ల మార్క్ను అందుకున్నాడు. బంతుల పరంగా ఈ ఘనత వేగంగా సాధించిన భారత క్రికెటర్గా చరిత్రకెక్కాడు. కాగా, ఇంగ్లండ్ బ్యాటర్లలో రూట్ (26; 56 బంతుల్లో), జానీ బెయిర్స్టో (29; 18 బంతుల్లో), బెన్ ఫోక్స్ (24; 42 బంతుల్లో) షోయబ్ బషీర్ (11*; 22 బంతుల్లో), టామ్ హర్ట్లీ ఆరు పరుగులు చేశారు. బెన్ స్టోక్స్, జేమ్స్ అండర్సన్ డకౌటయ్యారు. బెయిర్స్టో కూడా తన కెరీర్లో 100వ టెస్టు ఆడుతున్న విషయం తెలిసిందే.